ఇంటర్ బోర్డు పొరపాటు సవరణ: జూలై 4న ర్యాంకులు వెల్లడి
హైదరాబాద్: జేఈఈ, మెయిన్స్ ర్యాంకుల అంశంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా పొరపాటు జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ 1188 విద్యార్ధులు డేటా మిస్ అయిందని, పొరపాటును సరిదిద్దేందుకు అన్నీ చర్యలను చేపట్టామని తెలిపారు.
ఈ అంశంలో అధికారులను ఢిల్లీకి పంపించి జరిగిన పొరపాటు సరి చేయించామని స్పష్టం చేశారు. ఏ విద్యార్థికి అన్యాయం జరుగనీయమని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. జరిగిన పొరపాటుపై సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జూలై 4న ర్యాంకులు వెల్లడిస్తామని సీబీఎస్ఈ చెప్పిందని, జూలై 5, 6 తేదీల్లో ఆప్షన్లు మార్చుకోవచ్చని కడియం శ్రీహరి పేర్కొన్నారు. మొదటి విడత కేటాయింపులోనే విద్యార్థులకు సీట్లు వస్తాయని తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా 1188 మంది విద్యార్థుల మార్కుల వివరాలు సీబీఎస్ఈకు అందని విషయం తెలిసిందే.
దీంతో ఆయా విద్యార్ధులకు జేఈఈ, మెయిన్స్ ర్యాంకులు వెల్లడించలేదు. గురువారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు ఇటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన బోర్డు అధికారులను ఢిల్లీకి పంపించి పొరపాటు సరిచేశారు.