త్వరలో టీఆర్టీ కొత్త నోటిఫికేషన్, లక్ష ఉద్యోగాల భర్తీ: కడియం
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు 10 జిల్లాల ప్రతిపాదికనే టీఆర్టీని నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం సమావేశమై ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు.
తెలంగాణలో 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఉపాధ్యాయ పోస్టులను హైకోర్టు ఆదేశాల మేరకు 10 జిల్లాల వారీగా విభజించినట్టు చెప్పారు. సంబంధిత ఉత్తర్వులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి పంపుతున్నట్టు తెలిపారు. దీనిపై త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు.
కొత్త నోటిఫికేషన్ ఇస్తారా?, సవరించి ఇస్తారా? అనే విషయాన్ని టీఎస్పీఎస్సీ చూసుకుంటుందన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు నిరాశ చెందొద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
'కొలువులకై కొట్లాట' ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. నిరుద్యోగులను రాజకీయాల కోసం రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని స్పష్టంచేశారు.