కడియం రాజీనామా ఆమోదం, మోడీ దేశాలు తిరగడం తప్ప: వినోద్
హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన కడియం శ్రీహరి చేసిన రాజీనామాను లోకసభ సభాపతి సుమిత్రా మహాజన్ మంగళవారం నాడు ఆమోదించారు.
కడియం శ్రీహరి ఇటీవల శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వరంగల్ ఎంపీగా రాజీనామా చేశారు. దానిని స్పీకర్ ఆమోదించారు.
విభజన చట్టంపై నిర్లక్ష్యం: వినోద్ కుమార్
విభజన చట్టం అమలు పైన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు చేయడం మినహా రాష్ట్రాలకు ఏం చేయడం లేదన్నారు.
దేశాభివృద్ధికి కలిసి పని చేద్దామని, అందరం కలిసి సమష్టి నిర్ణయాలు తీసుకుందామని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. సభా సమయాన్ని వృధా చేయవద్దని ఆయన కోరారు. కాగా, సానియా మీర్జా, లియాండర్ పేస్, ఇస్రో శాస్త్రవేత్తలకు పార్లమెంటు ఉభయ సభలు అభినందనలు తెలిపాయి.
రాష్ట్ర అవసరాలపై పార్లమెంట్లో పోరాడుతాం: వేణుగోపాల చారి
రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పార్లమెంటులో పోరాడనున్నట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పుష్కరాలపై ఆయన స్పందిస్తూ ఇప్పటి వరకు 25 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారన్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా భద్రాచలంకు 200 అదనపు బస్సులు నడిపామని, ట్రాఫిక్, రద్దీ నియంత్రణ కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఫలించాయన్నారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పుష్కరాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని, తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు డిమాండ్ నెరవేరలేదని, రాష్ట్ర అవసరాలపై పార్లమెంట్లో పోరాడుతామని చెప్పారు.