జరిగిందేదో జరిగిపోయింది! పద్ధతి మార్చుకో: రాజయ్యపై కడియం, కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యను మార్చాలంటూ ఇప్పటికే పలువురు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం రాజయ్యను మార్చేది లేదని తేల్చి చెప్పింది.
రాజయ్య పద్ధతి మార్చుకోవాలి..
తాజాగా, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. రాజయ్య పద్ధతి మార్చుకోవాలని, ‘నా నియోజకవర్గం' అని అనకుండా మనది అనాలని కడియం హితవు పలికారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు.
రూమర్లను పట్టించుకోవద్దు
కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని తెలిపారు. రూమర్లను పట్టించుకోకుండా కేసీఆర్ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు.
రాజయ్యను గెలిపించాలి..
టీఆర్ఎస్ బలపడాలన్నా, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నా స్టేషన్ ఘన్పూర్లో రాజయ్యను గెలిపించాలని ప్రజలను కోరారు. రాజయ్య కూడా అందరినీ కలుపుకుపోవాలని.. కేసీఆర్, కడియం శ్రీహరి అంటే ఇష్టం, అభిమానం ఉన్నవాళ్లంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.
జరిగిందేదో జరిగిపోయింది..
ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందని.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని కడియం అన్నారు. మనమందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదన్నారు. రాజయ్యకు తన పూర్తి సహకారం ఉంటుందని, తనను అభిమానించే వారందరూ పూర్తిస్థాయిలో రాజయ్యకు సహకరించి స్టేషన్ ఘన్పూర్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని కడియం పిలుపునిచ్చారు.