రాజయ్య వద్దు, టిక్కెట్ లేదంటే రాజీనామా: కడియంకు అనుచరులు, రంగంలోకి కేటీఆర్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితిలో సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ 105 మంది అభ్యర్థులను దాదాపు నెల రోజుల క్రితం ప్రకటించారు. అందులో కొంతమంది అభ్యర్థులపై అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్ ఘనపూర్ నియోజవకర్గం కూడా ఇందులో ఒకటి. టీ రాజయ్యకు చెక్ చెప్పేందుకు కడియం శ్రీహరి వర్గం ప్రయత్నాలు చేస్తోంది.
బాల్క సుమన్ వర్సిటీలో ఫ్రీ భోజనం తిని: రేవంత్, అదంతా ఎత్తుకెళ్లారని.. ఐటీ దాడులపై రివర్స్!
కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి కచ్చితంగా పోటీ చేయాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కూతురు కడియం కావ్యనైనా బరిలోకి దింపాలని అంటున్నారు. ఆయన అభిమానులు, అనుచరులు నిత్యం ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది చినికి చినికి గాలివానలా మారుతోంది.
స్టేషన్ ఘనపూర్పై కేటీఆర్ దృష్టి
దీంతో కేటీఆర్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సీట్ల పంచాయతీపై దృష్టి సారించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయన రంగంలోకి దికారు. సోమవారం ప్రగతి భవన్లో కడియం శ్రీహరి, టీ రాజయ్యలతో భేటీ అయ్యారు. రాజయ్యపై అసంతృప్తి పెరుగుతోన్న నేపథ్యంలో ఏం చేద్దామని వారితో చర్చలు జరిపారు. దాదాపు మూడు గంటలకు పైగా చర్చించారు.
కేసీఆర్ను ఒప్పించి టిక్కెట్ తెచ్చుకోండి
కడియం శ్రీహరి ఆదివారం తన అనుచరులతో హన్మకొండలో దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేయాల్సిందేనని భారీ సంఖ్యలో ఆయన అనుచరులు హన్మకొండకు తరలి వచ్చారు. శ్రీహరికి టిక్కెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. మీరు కేసీఆర్ను ఒప్పించి, టిక్కెట్ తెచ్చుకోవాలని, అధిష్టానాన్ని ఎలాగైనా ఒప్పించి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేయాలని, రాజయ్య పోటీ చేస్తే ఓటమి ఖాయమని వారు అన్నారు.
రాజీనామా చేస్తాం
స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ చేయకుంటే తాము నిరాహార దీక్షకు కూడా దిగేందుకు సిద్ధమని, తమ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తదితర పదవులకు రాజీనామా చేస్తామని చెప్పారని తెలుస్తోంది. ఆదివారం రోజు అప్పటికి వారికి సర్ది చెప్పారు. మీ ఆవేదనను అర్థం చేసుకున్నానని, తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. టిక్కెట్ ఇవ్వకున్నా పార్టీ మాత్రం మారేది లేదని కడియం అనుచరులకు తేల్చి చెప్పారు.
పార్టీ మారుతున్నట్లు ప్రచారంపై ఆగ్రహం
తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోందని, అది అవాస్తవమని కడియం శ్రీహరి అన్నారు. తన జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని, అలాంటి పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లనని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ తెరాసనే అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. మరి స్టేషన్ ఘనపూర్లో రాజయ్య అభ్యర్థిత్వమే ఉంటే ఆయన తరఫున ప్రచారం చేస్తారా అని అడిగితే.. అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానని చెప్పారు.