చర్చనీయం: ఎమ్మెల్యే వినయ్ ఇంటికి డిప్యూటీ సీఎం కడియం, 2గంటలపాటు భేటీ
వరంగల్ అధికార పార్టీలో కొత్త రాజకీయం మొదలైంది. రాజకీయంగా దూరంగా ఉంటున్న ఇద్దరు కీలక నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వరంగల్: వరంగల్ అధికార పార్టీలో కొత్త రాజకీయం మొదలైంది. రాజకీయంగా దూరంగా ఉంటున్న ఇద్దరు కీలక నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం రాత్రి పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇంటికి వెళ్లారు. వీరిద్దరు దాదాపు రెండు గంటలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తాజా రాజకీయ పరిణామాలపై వీరి మద్య చర్చ జరిగినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేవంతమైన నేపథ్యంలో వీరిద్దరు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్భాస్కర్ ఒకే పార్టలో ఉన్నా ఇద్దరి మధ్య కొంత అంతరం ఉంటోంది.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కలిసి సాగుతున్నా... రాజకీయంగా ఇద్దరు అంతగా కలిసినట్లు కనిపించదు. ఇలా రాజకీయంగా ఎవరికివారుగా ఉండే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్భాస్కర్లు ప్రత్యేకంగా ఇద్దరే సమావేశం కావడం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కొందరు టీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్న విషయంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
పార్టీ నేతలకు రానున్న పదవుల విషయంపైనా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పదవుల విషయంపైనా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ గ్రేటర్ వరంగల్కు ఇచ్చిన హామీల అమలు అంశాలపై ఇద్దరు మాట్లాడుకున్నట్లు తెలిసింది.