సెలబ్రిటీ కావాలని రెండోసారి..: హైదరాబాద్ కాజల్ మరో 'పూర్ణిమ'
నటి కావాలని, తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయిన పూర్ణిమ సాయి ఉదంతం మరవకముందే మరో యువతి సెలబ్రిటీ కావాలని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
హైదరాబాద్: నటి కావాలని, తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయిన పూర్ణిమ సాయి ఉదంతం మరవకముందే మరో యువతి సెలబ్రిటీ కావాలని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఈ సంఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. రోడ్డు నెంబర్ 7లో ఉంటున్న కాజల్(19) సెలబ్రిటీ కావాలన్న కోరికతో రెండోసారి అదృశ్యమైంది.
ఆ నటితో పూర్ణిమ చాట్: ఎంత తెలివైందంటే?, 'పేరెంట్స్'ను వద్దనడం వెనుక..
ఆమె మొదటిసారి వెళ్లినప్పుడు పోలీసులు ఆచూకీ కనిపెట్టి కొద్ది రోజులకు ఇంటికి తీసుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి మిస్సింగ్ కేసు నమోదయింది.
అమ్మ నో చెప్పడంతో..
తన కోరికను ఆమె పేరెంట్స్కు చెప్పింది. తల్లి నో చెప్పడంతో వెళ్లిపోయింది. కాజల్ది సంపన్న కుటుంబం. తల్లి శామా ముఖర్జీ యోగా ట్రైనర్గా పని చేస్తున్నారు. తండ్రి వీరికి దూరంగా ఉంటున్నారు.
ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని..
కాజల్ సోమాజిగూడలోని విల్లా మేరీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సెలబ్రిటీ కావాలని మొదటి నుంచి అనుకుంటోంది. ఇందుకు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటేనే మంచిదని భావించింది.
తల్లికి నచ్చపోవడంతో..
ఇందులో భాగంగా ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు, స్నేహాలు పెంచుకుంది. తల్లికి ఇది నచ్చలేదు. కూతురును స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లకు దూరంగా ఉంచింది. ఇది జీర్ణించుకోలేకపోయిన కాజల్ ఈ నెల 8న ఇంటి నుంచి వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెతికి తీసుకు వచ్చారు.
మా అమ్మతో ఉండను
తాను అమ్మతో ఉండనని, మీరు బలవంతంగా పంపించినా నేను ఇంటి నుంచి తిరిగి వచ్చేస్తానని, మా అమ్మ అంటే నాకు చిరాకు అని పోలీసులకు కాజల్ అప్పుడే చెప్పింది. సెలబ్రిటీ కావాలనేది తన కోరిక అని, తన తల్లి ఉంటే తన కోరిక నెరవేరదని చెప్పడంతో పోలీసులే విస్తుపోయారు. మొత్తానికి ఒప్పించి పంపించారు.
పరిచయాలు పెంచుకొని..
ఆ తర్వాత నాలుగు రోజులకే కాజల్ ఇంటి నుంచి మళ్లీ వెళ్లిపోయింది. బుధవారం ఉదయం 11 గంటలకు తల్లితో చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తల్లి మరోసారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె క్షణాల్లోనే ఎవరితోనైనా పరిచయాలు పెంచుకొని స్నేహితులుగా మార్చుకుంటుందని శామా పోలీసులకు చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో ఇక్కడి వాళ్లే కాకుండా విదేశీయులు, ఇతర నగరాలకు చెందిన వారు ఎంతో మంది స్నేహితులుగా ఉన్నారని వివరించారు. వద్దన్నా వినకుండా స్మార్ట్ ఫోన్ వాడుతోందని, ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే తననో దోషిగా నిలబెడుతోందంటూ వాపోయారు. మళ్లీ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.