సికింద్రాబాద్లో కాకినాడ బాలిక అపహరణ, సిసి కెమెరాల్లో వీడియో
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదేళ్ల బాలిక దుర్గను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రాణి అనే మహిళ తన కుమార్తెతో పాటు కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చింది. తిరిగి కాకినాడ వెళ్లేందుకు స్టేషన్కు వచ్చింది. ఆసమయంలో ఓ మాయలేడి రాణితో పరిచయం చేసుకొని బాలికను ఎత్తుకెళ్లింది.
తన కూతురును అప్పగించాలని బాధితురాలైన తల్లి ఆవేదన వ్యక్తంచేస్తోంది. తాను కాకినాడ నుంచి వచ్చానని, తన తమ్ముడి వద్ద డబ్బులు తీసుకునేందుకు వచ్చానని, అతను తర్వాత ఇస్తానని చెప్పడంతో తిరిగి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చానని తెలిపింది.
స్టేషన్లో ఓ మహిళ తాను విజయవాడకు వస్తున్నానని చెప్పిందని తెలిపింది. తనతో పరిచయం ఏర్పరుచుకొని, తన పక్కనే నడుస్తూ వచ్చిందని తెలిపింది. తాను తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నానని, ఆ సమయంలో తన కూతురు దుర్గ ఏడ్చిందని తెలిపింది.
అప్పుడు ఆమె తన కూతురును ఎత్తుకుందని, ఈ క్రమంలో పాప కోసం పళ్లు తీసుకుందామని భావించానని, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె కనిపించలేదని వాపోయింది. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది.
సీసీ కెమెరాలను పరిశీలిస్తే, బాలికను ఎత్తుకెళ్తున్నట్లు కనిపించిందన్నారు. పట్టుకుంటామని పోలీసులు చెప్పారన్నారు. మాయలేడీ వంకాయ రంగు చీర, జాకెట్ వేసుకుందన్నారు. ఆమెకు 30 ఏళ్లు ఉంటాయన్నారు. ఆమె తెలంగాణ యాసలో మాట్లాడిందని చెప్పారు.
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
మెదక్ జిల్లా సదాశివపేటలో ఓ భార్య తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ప్రేమ వివాహం చేసుకొని మోసం చేశాడని ఆరోపించింది. భర్త చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఆమె శుక్రవారం భర్త ఇంటి ముందు నిరసన తెలిపింది.
మేడ్చల్లో బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్లో భార్గవ్ అనే బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్గవ్ మృతికి ప్రిన్సిపల్ కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు.