బాత్రూంలో దాక్కున్న కళానికేతన్ ఎండీ శారద: తలుపులు పగులగొట్టి అరెస్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో వస్త్ర వ్యాపారాలను కళానికేతన్ పేరిట నిర్వహిస్తున్న లీలా ప్రసాద్ భార్య, కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీ శారదను ధర్మవరం పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్లోని ఫిలింనగర్ సినారీ వ్యాలీలో అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలోని 80 మందికి పైగా చేనేత వస్త్రాల తయారీదారుల నుంచి రూ. 9 కోట్ల విలువైన వస్త్రాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత వారికి చేనేత కార్మికులకు డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టారు.
దీంతో కళానికేతన సంస్ధతో పాటు సంస్ధ ఎండీ వేములూరి లీలాకుమార్, ఆయన సతీమణి వేములూరి లక్ష్మీశారద, జి.రాజుకృష్ణ, జె. వెంకటేశ్వర రవిప్రసాద్లపై ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వీరందరిపై ఈ ఏడాది జనవరి 11న కేసు నమోదైంది.
కేసును నమోదు చేసిన ధర్మవరం ఎస్సై సునీతతోపాటు మరికొంత మంది పోలీసులు సినార్ వ్యాలీలోని లీలాకుమార్ నివాసానికి సోమవారం ఉదయం 6.30 ప్రాంతంలో స్థానికి బంజారాహిల్స్ పోలీసులతో కలిసి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన లీలా ప్రసాద్ తప్పించుకు పోయారు.
ఇంట్లో లక్ష్మీ శారద ఒక్కరే ఉన్నారు. ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు అందించారు. దీంతో ఆమె తాను దుస్తులు మార్చుకొని వస్తానంటూ బాత్ రూమ్లో దాక్కున్నారు. అరగంట దాటినా బయటకు రాలేదు. ఎంతసేపు పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో చివరకు తలుపులు పగలుగొట్టి ఆమెను అరెస్ట్ చేశారు.
అయితే ఇదంతా జరగడానికి ముందే ఆమె సెల్ఫోన్తో పోలీసులు ఇంటికి వచ్చిన విషయాన్ని లాయర్కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె తరుపు లాయర్ పోలీసులతో మాట్లాడుతుండగా, ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో వెంటనే ఆమెను జూబ్లిహిల్స్లోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు 41, 47 సీఆర్పీపీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించిన ధర్మవరం పోలీసులు లక్ష్మీశారదను తమతో పాటు తీసుకెళ్లారు. వీరిపై మొత్తం అయిదారు కేసులు నమోదయ్యాయి.
ధర్మవారం ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు మేకల శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
14 రోజుల రిమాండ్ విధించిన ధర్మవరం కోర్టు
సోమవారం రాత్రే అనంతపురం జిల్లాకు తరలించిన ధర్మవరం పోలీసులు మంగళవారం ఉదయం ఆమెను ధర్మవరం కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆమెకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఆమెను పోలీసులు అనంతపురంలోని జిల్లా జైలుకు తరలించారు.