కళానికేతన్ డైరెక్టర్ నుంచి కీలక సమాచారం, ఎండీకి బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్: కళానికేతన్ సంస్థ ఎండీ లీలా కుమార్ పైన పోలీసు ఉచ్చు మరింత బిగుస్తోందని వార్తలు వస్తున్నాయి. అతను ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. అతనిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
బాత్రూంలో దాక్కున్న కళానికేతన్ ఎండీ శారద: తలుపులు పగులగొట్టి అరెస్ట్
ఎండీ లీలా కుమార్, డైరెక్టర్ లక్ష్మీశారద, అడిషనల్ డైరెక్టర్లు రాజకృష్ణ, వెంకటరవిప్రసాద్ల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ధర్మవరం పోలీస్ స్టేషన్లో వారి పైన ఎనిమిది కేసులు నమోదయ్యాయి. సంస్థ డైరెక్టర్ లక్ష్మీశారదను పోలీసులు పన్నెండు రోజుల క్రితం హైదరాబాదులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో వారు కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. వారి నుంచి కోట్లాది రూపాయల మొత్తం బాధితులకు రావాల్సి ఉందని తెలుస్తోంది. మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో కూడా పలుమార్లు ధర్మవరం పోలీసులు లీలా కుమార్, లక్ష్మీశారదలను అరెస్టు చేసేందుకు వెళ్లారు. తాజాగా, పన్నెండు రోజుల క్రితం లక్ష్మీశారదను అరెస్టు చేశారు. లక్ష్మీశారద నుంచి సేకరించిన వివరాల ఆధారంగా పోలీసులు మరింత వేగంగా దర్యాఫ్తు చేయనున్నారు. లీలా కుమార్ కదలికల పైన సమాచారం ఉందని వార్తలు వస్తున్నాయి.