కాళేశ్వరం వందకు వంద శాతం కేసీఆర్ రెక్కల కష్టమే..! నా శ్రమ నామమాత్రమేనన్న హరీశ్రావు..!!
హైదరాబాద్ : ఎత్తి పోతల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టుకు నిర్మించినందుకు రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే హరీశ్రావు హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలను హరీశ్రావు సిద్దిపేట జిల్లాలోనే చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్లోని రంగనాయక సాగర్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి హరీశ్రావు హాజరై కేక్ కట్ చేసి,కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందని.. సీఎం చంద్రశేఖర్ రావు శ్రమతో మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని,రానున్న రోజుల్లో రెండు పంటలను చూస్తామని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల పేర్లు మరిచిపోయామని, ఆ పార్టీ అధికారంలో ఉంటే 30 ఏళ్లు గడిచినా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాదని హరీష్ రావు విమర్శించారు. అంతే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క భారీ ప్రాజెక్టు కూడా నిర్మించుకోలేకపోయామని అన్నారు. సీఎం పట్టుదలతో ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 70ఏళ్ల కాలంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టులు కట్టలేదని హరీష్ రావు ఆరోపించారు.
కాళేశ్వరం కోసం ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు ఎంతో కష్టపడ్డారన్నారు. ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులందరికీ హరీశ్రావు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో దసరా పండగ ఎంత ముఖ్యమో.. కాళేశ్వరం ప్రారంభోత్సవం కూడా అంతే ముఖ్యమన్నారు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టు పనుల్లో తన వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉందని హరీశ్ అన్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మరియు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హాజరయిన సంగతి తెలిసిందే.