కాళేశ్వరం మొదటి వెట్ రన్ సక్సెస్ : రేపట్నుంచి మరో మూడు టెస్ట్, అధికారులకు సీఎం ప్రశంసలు
హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. నీటిని ఎత్తిపోసేందుకు భారీ మోటర్లలో నిర్వహించిన మొదటి మోటర్ వెట్ రన్ విజయవంతమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్ చేసి వెట్ రన్ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్పూల్ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్కు .. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్ సర్జ్పూల్కు చేరాయి. లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్మానేరును తాకాయి.
బాహుబలి మోటారుతో ఎత్తిపోత
మేడిగడ్డ బరాజ్ సహా పలు జిల్లాల్లో 151 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను రిజర్వాయర్లకు తరలించి నిల్వచేసేందుకు మొత్తం 82 మోటర్లను ఏర్పాటుచేశారు. 2.66 మెగావాట్ల నుంచి 26, 40, 106.. బాహుబలిగా పిలిచే 139 మెగావాట్ల మోటరును వినియోగించారు. నంది మేడారం పంపుహౌజ్లో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను అమర్చారు. ఏడింటికిగాను నాలుగు డ్రైరన్ పూర్తి చేసుకొని, వెట్ రన్ కు సిద్ధంగా ఉన్నాయి. నాలుగింటిలో బుధవారం ఒకటి వెట్రన్ విజయవంతమయింది. మిగతా మూడు గురువారం నుంచి వరుసగా వెట్రన్ ప్రారంభించనున్నారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి విడుదల చేసిన నీటితో నందిమేడారం పంపుహౌజ్లోని సర్జ్పూల్లో మంగళవారం రాత్రి 142.30 మీటర్ల మేర నింపారు. సోమవారం రాత్రి మొదటి మోటరుకు సంబంధించిన డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్ను ఎత్తిన అధికారులు .. మంగళవారం రాత్రి రెండో మోటరు డ్రాఫ్ట్ట్యూబ్ గేటును కూడా ఎత్తడంతో .. వెట్ రన్ ప్రక్రియ ప్రారంభమైంది.
వెట్ రన్ సక్సెస్పై సీఎం హర్షం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అభినందనీయమన్నారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం.
తీరనున్న సాగునీటి బాధలు
తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేశామన్నారు కేసీఆర్. పలు విధాలుగా ఆలోచించి, శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నామని గుర్తుచేశారు. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో గత్యంతరం లేదని తీర్మానించుకున్నాకే .. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశామని చెప్పారు. ఇందుకోసం రక్షణ శాఖ అనుమతి తీసుకుని మరీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లైడార్ సర్వే నిర్వహించి, పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని తెలిపారు.
అధికారులు, ఇంజినీర్లకు అభినందనలు
గోదావరి నుంచి నీటిని తోడడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 139 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్ చేశామన్న కేసీఆర్ .. గతంలో తెలంగాణలో 80 నుంచి 85 మీటర్ల వరకు మాత్రమే ఎత్తిపోసిన అనుభవం ఉందన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడానికి ఇంజనీర్లు, అధికారులు విదేశాలకు కూడా వెళ్లారు. సంపూర్ణ అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతో పనులు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల తలరాత మార్చే కల్పతరువు అని. ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లను సీఎం కేసీఆర్ అభినందించారు.