కాళేశ్వరం ప్రాజెక్టుకి కీలక అనుమతులు: కేసీఆర్, హరీశ్ హర్షం, గడ్కరీకి కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ కీలకమైన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(సీడబ్ల్యూసీ) అనుమతులు ఇచ్చింది. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో టీఏసీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఏసీ అనుమతులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు పొందిన ఏకైక భారీ ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు నెలకొల్పింది. ఒక నెలలోపే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి, రెండో దశ అటవీ అనుమతులు సాధించింది.
అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ క్లియరెన్స్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైడ్రాలజీ అనుమతుల తర్వాత పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఏడాదిలోపు పర్యావరణ అనుమతులు పొందిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కానుంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణకు సాగు, తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.