కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి..! లోక్ సభలో డిమాండ్ చేసిన నామా..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు సోమ వారం లోక్సభలో 'రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం' పై జరిగిన చర్చలో మాట్లాడారు. 'తెలం గాణ ఏర్పడి కొద్దికాలమే అయినా రైతుల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ అనేక సాగునీటి ప్రాజెక్టులు ఆరంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించగలిగారు.
దీనికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మొదటి నుంచీ కోరుతున్నాం. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడిచినా అనేక నిబంధనలు అమలు కాకుండా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. నదుల అనుసంధానం చేపట్టి తద్వార కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా నిధులు అందజేయాలి' అని కోరారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం లేదని రాష్ట్ర డ్రైనేజ్ బోర్డు మాజీ సభ్యులు, రైతు సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గోదావరి నది కాలువగా ఉపయోగించుకుని రివర్స్ పంపింగ్ ద్వారా రీ-డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని వివరించారు. గోదావరి జల్లాల్లో తెలంగాణకు కేటాయించిన 936 టీఎంసీలలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 350 టీఎంసీల నీటిని వినియోగించుకుంటారని తెలిపారు.
ఈ నీటిని వినియోగించుకున్నా.. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత పోలవరం కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 300 టీఎంసీలు, దిగువన మరో 500 టీఎంసీల నీటికి ఢోకా ఉండదని తెలిపారు. గోదావరిలో జూన్ నుంచి అక్టోబర్ 10 వరకు 100 రోజుల్లో సుమారు 80 రోజులు మిగులు జలాలు ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా -పెన్నా నదులకు తరలించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ కలిసి వస్తే పులిచింతల ఎగువన కృష్ణానదిపై 2 బ్యారేజలు నిర్మించి సాగర్ టెయిల్పాండ్లోకి, అక్కడ నుంచి సాగర్లోకి నీటిని ఎత్తిపోయాలన్నారు.
శ్రీశైలం వద్దకు చేరిన నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రాజెక్టులు ప్రణాళిక బద్దంగా వాడుకోవచ్చన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో వెనులుబాటు కల్పించిన డెసిషన్-ఇంప్లిమెంటేషన్ బోర్డ్ ఏర్పరచుటకు వీలుగా సుప్రీం కోర్టులలోను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందున్న దావాలను ఇరు రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలన్నారు.