చింతమడక నుంచి తొలి సీఎం వరకు: తెలంగాణ సాధకుడు కేసీఆర్ ప్రస్థానం
హైదరాబాద్: తెలంగాణ ప్రజల చీరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చేశారు.. ఎంతోమంది పోరాడారు.. కానీ, ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి రాష్ట్రం సాధించే వరకు విశ్రమించకుండా పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పవచ్చు.
Recommended Video
ప్రజలనేకాదు, అన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ సాధన కర్తగా.. తెలంగాణ గాంధీగా ఆయన పిలుచుకుంటున్నారు కూడా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన జీవన ప్రస్తానం గురించి ఒక్కసారి గమనించినట్లయితే..
కేసీఆర్ ప్రస్థానం..
ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు కేసీఆర్. ఉస్మానియా వర్శిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. ఆయన భార్య శ్రీమతి శోభా. కేసీఆర్ దంపతులకు ఒక కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత.
టీఆర్ఎస్ స్థాపన-తెలంగాణ ఉద్యమం
విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన చంద్ర శేఖరరావు.. ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1999-2001 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్గా పనిచేశారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు. 2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.
14వ లోక్ సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోకసభ సభ్యులన్న టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మంత్రి పదవి పొందారు. 2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కేసీఆర్.. అనంతరం జరిగిన ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై రెండు లక్షలకుపైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్తో 2008లో మళ్లీ రాష్ట్రమంతటా టీఆర్ఎస్ సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి లక్షా 50 వేల పైగా మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత 2009లో జరిగిన 15వ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మతి చెందడం.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు వంటి పరిణమానాలను తనకు అనుకూలంగా మార్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచారు.
2009, నవంబర్ 29న నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టారు. దీనిని దీక్షా దివస్గా పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోరాటం ఉధృతం కావడంతో ఇక తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం .. 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సీమాంధ్రలో ఉమ్మడి రాష్ట్రం కోసం ఆందోళనలు మిన్నంటడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో తెలంగాణలో మరోసారి తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపు దాల్చింది.
కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు పోరాటం తీవ్ర తరం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు బంగారు తెలంగాణ నినాదంతో పాలన కొనసాగిస్తున్నారు.