బాబు ఏ1, మౌనమెందుకు: ఎల్లో మీడియాపై కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం అన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. ట్యాంక్ బండ్ పైన అన్ని జిల్లాల ప్రజలతో శోభాయాత్ర జరుగుతుందన్నారు.
వారం రోజుల పాటు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. శోభాయాత్రలో లక్షమంది వరకు పాల్గొంటారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని, గతంలో ఏ సీఎం ఇలా చేయలేదని చెప్పారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చాలని కవిత అన్నారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఎల్లో మీడియా వంత పాడుతోందని ఆరోపించారు.
కేబినెట్లోకి మహిళలు
రాష్ట్ర కేబినెట్లోకి మహిళలను తీసుకోవాలనే యోచన సీఎం కేసీఆర్కు ఉందని చెప్పారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఎలాంటి శృత్రుత్వం లేదని చెప్పారు.
కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరారు. హైకోర్టు విభజన, ప్రాణహిత - చేవెళ్ల, ఉద్యోగుల విభజనపై చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో జయశంకర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.
హిమాలయాలపై తెలంగాణ జెండా
ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా హిమాలయాల పైన తెలంగాణ జెండా రెపరెపలాడింది. జూన్ 2న తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. అనంతరం హిమాలయాల నుంచి తెలంగాణ అడ్వెంచర్ క్లప్ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు.