తిక్క పవన్ కళ్యాణ్కు కెసిఆర్ చుక్కలు చూపించారు: కవిత, "కెసిఆర్ రాజకీయ ఉగ్రవాది"
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్పై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడే గంగిరెద్దుల్లా కొంత మంది వస్తారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో టిడిపి, బిజెపి పవన్ కళ్యాణ్ను ప్రచారంలోకి దించుతాయట అంటూ ఆమె పలు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలప్పుడు మేకప్, ఆ తర్వాత పేకప్ అంటూ కవిత వ్యాఖ్యానించారు. తిక్క పవన్ కళ్యాణ్కు కెసిఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని ఆమె శనివారంనాడు వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్లు ఎక్కువగా ఉన్నారని ఆంధ్రోళ్లతో హైదరాబాదులో ప్రచారం చేయిస్తారట అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మేకప్ వేసుకుని వచ్చేవారిని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు.
కెసిఆర్ రాజకీయ ఉగ్రవాది
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క రాజకీయ ఉగ్రవాదిగా అభివర్ణించారు. తెలంగాణలో ఇతర పార్టీలు లేకుండా చేయాలనే ఆలోచనతోనే కెసిఆర్ రాజకీయ ఉగ్రవాదానికి తెరలేపుతున్నరాని ఆయన అన్నారు. ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని ఆయన అన్నారు.
ప్రాజెక్టుల నుంచి వచ్చిన అవినీతి సొమ్ముతో ఇతర పార్టీలకు చెందిన నేతలను కెసిఆర్ కొంటున్నారని ఆయన ఆరోపించారు. జిహెచ్ఎంసి డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు శాస్త్రీయంగా జరగలేదని ఆయన అన్నారు. ఏ ప్రాతిపదికను రిజర్వేషన్లు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను తారుమారు చేశారని ఆయన అన్నారు.
మొత్తం ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బిసీ మహిళల శాథం ఎంతో చెప్పాలని, ఏ దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ డివిజన్లు పెంచాలని ఆయన కోరారు. కెసిఆర్పై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని ఆయన అన్నారు.