అన్యాయం అంటూనే మోడీని ఆకాశానికెత్తిన కల్వకుంట్ల కవిత
ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తూనే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ఆమె కొనియాడారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల ఎలాంటి సమస్య రాలేదని, అయితే ఈ పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆమె అన్నారు. మంగళవారం లోక్ సభలో ఆమె మాట్లాడారు. బ్రిటిష్ సంప్రదాయాలకు స్వస్తి పలికారని మోడీని ప్రశంసించారు. బడ్జెట్లో ఎన్నో సానుకూల అంశాలున్నాయని, సంక్షేమ పథకాలకు ఈ సారి నిధులు పెంచారని కవిత అన్నారు.
అయితే, కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు. తెలంగాణకు సరియైన కేటాయింపులు చేయలేదని అభిప్రాయపడ్డారు. ఈసారి బడ్జెట్లో విప్లవాత్మకమైన మార్పులు చేశారని కొనియాడారు.
ఈసారి బడ్జెట్లో రాష్ట్రాలకు కేటాయింపులు తగ్గించారని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో విద్యకు కేటాయింపులు పెంచడం శుభపరిణామమని అన్నారు. ప్రధాని గ్రామీణ ఆవాస్ యోజన కింద ప్రతీ సంవత్సరం ఇళ్ల నిర్మాణం తగ్గుతోందని తెలిపారు.