కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్... కల్వకుర్తి పంప్ హౌస్ సందర్శనను అడ్డుకున్న పోలీసులు...
శుక్రవారం(అక్టోబర్ 16) చోటు చేసుకున్న ప్రమాదానికి కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ నీట మునగడంతో శనివారం కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉప్పునుంతల-కొల్లాపూర్ మార్గంలో తెలకపల్లి వద్ద కాంగ్రెస్ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ రేవంత్ సహా పలువురి నేతల వాహనాలను ముందుకు కదలినివ్వలేదు. దీంతో రేవంత్ గంట పాటు రోడ్డుపైనే కారులో కూర్చొండిపోయారు.
అదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. రేవంత్ సహా కాంగ్రెస్ నేతలందరినీ కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ వద్దకు అనుమతించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాసేపటికి రేవంత్ కారు నుంచి కిందకు దిగి... పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఈ క్రమంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రేవంత్ కాలికి స్వల్ప గాయమైంది.
ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ మాట్లాడుతూ... నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమీపంలోనే పాలమూరు-రంగారెడ్డి సొరంగం మార్గం పనులు చేపట్టారని మండిపడ్డారు. కమీషన్ కక్కుర్తి కోసం ఓపెన్ కెనాల్ను సొరంగ మార్గంగా మార్చారని ఆరోపించారు. పోలీసులు ఎంపీ రేవంత్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి,ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లను అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్కు తరలించారు.
కల్వకుర్తి పంప్ హౌస్లో శుక్రవారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఉన్నట్టుండి మోటార్ బిగించిన ఫౌండేషన్ బోల్టులు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. దీంతో భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఇంజనీర్లు,సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటకు పరుగుతీశారు. కాసేపటికి మళ్లీ లోపలికి వెళ్లి గమనించగా... మూడో మోటార్ నుంచి భారీగా నీళ్లు పైకి వస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఏం జరిగిందో అర్థం కాక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
Recommended Video
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి పంప్ హౌస్ ఉన్న ఎల్లూరుకు కేవలం 400మీ. దూరంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పంప్ హౌస్ కోసం సొరంగ మార్గాన్ని చేపట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్కడ సొరంగ మార్గం కోసం చేపడుతున్న డ్రిల్లింగ్,బ్లాస్టింగ్స్ కల్వకుర్తి పంప్ హౌస్పై ప్రభావం చూపించినట్లు ఆరోపిస్తున్నారు.