కల్వకుర్తిలో "గులాబీ ముల్లు".. నేతల మధ్య డిష్యుం డిష్యుం.. కేటీఆర్ ఏమంటారో?
Recommended Video
నాగర్కర్నూలు : రెండోసారి అధికారంలోకి వచ్చి ఫుల్ స్వింగ్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కొన్నిచోట్ల తలనొప్పులు తప్పడం లేదా? ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ దూసుకెళుతున్న గులాబీ పార్టీలో అప్పుడే ఇంటిపోరు మొదలైందా? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా జరుగుతున్న పరిణామాలు సమాధానంగా కనిపిస్తున్నాయి.
నాగర్కర్నూలు జిల్లాలోకి కల్వకుర్తి సెగ్మెంట్ వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్ అనే పేరుంది. నేతల మధ్య ఎంతలా విభేదాలుంటాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. తాజాగా టీఆర్ఎస్ ముఖ్యనేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
కసిరెడ్డి Vs జైపాల్ యాదవ్
నాగర్కర్నూలు జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ రోడ్డెక్కింది. నువ్వా నేనా అనే రీతిలో లీడర్ల మధ్య డిష్యుం డిష్యుం మొదలైంది. ఈక్రమంలో కల్వకుర్తి సెగ్మెంట్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ కు వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డిని.. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గం అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. కసిరెడ్డిపై కుర్చీలతో దాడిచేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కసిరెడ్డిని అక్కడినుంచి పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది.
విశాఖపట్నంకు కేసీఆర్, రోడ్డంతా గులాబీ ఫ్లెక్సీలు, తోరణాలు: థర్డ్ ఫ్రంట్ కోసం మూడ్రోజులు బిజీ
ఈనాటి "కసి" ఏనాటిదో..!
కసిరెడ్డి వర్సెస్ జైపాల్ యాదవ్. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా వీరిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటోంది వ్యవహారం. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగి వీరిద్దరికీ సర్ధిచెప్పిన రోజులున్నాయి. కానీ వీరి ప్రవర్తనలో మార్పు లేదు. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లోనే ఉంటోంది వీరి వాలకం. తాజాగా జరిగిన వివాదంతో వీరిమధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈనేపథ్యంలో అధిష్టానం వీరిద్దరికీ మొట్టికాయలు వేస్తుందా లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అనే కోణంలో ఉహాగానాలు జోరందుకున్నాయి.
అధినేత అలా.. నేతలేమో ఇలా
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్.. పార్టీ బలోపేతానికి కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా జిల్లాల పర్యటనలకు వెళుతూ.. క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండోసారి అధికారం కట్టబెట్టిన ప్రజలకు రుణపడి ఉండాలని.. టీఆర్ఎస్ శ్రేణులకు అహంకారం ఉండొద్దని చెబుతూ వస్తున్నారు. ఎంతో నమ్మకంతో ఓట్లేసిన ప్రజల మెప్పు పొందాలని పిలుపునిస్తున్నారు. ఈనేపథ్యంలో కల్వకుర్తి గులాబీ నేతల పంచాయితీని కేటీఆర్ ఏవిధంగా చూస్తారనేది చర్చానీయాంశంగా మారింది.