కళ్యాణమైంది..పిల్లలు పుట్టారు.. 'లక్ష్మి' ఎక్కడ?
ఖమ్మం: పాలకులు ఎప్పుడూ ప్రభుత్వ పథకాల గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఆ పథకాల అమలువల్ల ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయినట్లు, సుఖసంతోషాలతో ఉన్నట్లు చిత్రీకరిస్తారు. కాని వాస్తవం అందుకు భిన్నంగా ఉంటుంది. తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇలాగే ఉంది. అన్ని పథకాల గురించి గొప్పగా ప్రచారం చేసినట్లే 'కళ్యాణ లక్ష్మి' పథకం గురించి కూడా ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసింది. కాని ఆచరణలో నత్తనడక నడుస్తోంది.
ఈ పథకంపై ఆశలు పెట్టుకున్న పేదలు నిరాశ చెందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. పథకం ప్రవేశపెట్టినప్పుడు రూ.51 వేలుగా ఉన్న మొత్తం ఆ తరువాత రూ.75 వేలకు పెరిగింది. అయితే జిల్లాలో రూ.51 వేలు అందిస్తున్నప్పుడు వివాహం చేసుకున్నవారిలో దాదాపు సగంమందికి ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందలేదు. ఇదీ అధికారుల నిర్వాకం....! ఈ పథకానికి నమోదు చేసుకొని వివాహమైన చాలామందికి పిల్లలు కూడా పుట్టారు. కాని ఇప్పటికీ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
3,740 మంది దరఖాస్తుదారుల్లో 1,757 మంది మాత్రమే. డబ్బు అందనివారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనేవున్నారు. ఈ దరఖాస్తులన్నీ ఇంకా వివిధ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని తిరస్కరణకు గురయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యేల దగ్గర 299 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. తహశీల్దారుల వద్ద 844 పెండింగ్లో ఉన్నాయి. కంప్యూటరైజ్ అయిన దరఖాస్తుల్లో కొన్ని ట్రెజరీ అధికారుల దగ్గర మూలుగుతున్నాయి.
నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారుల్లో కొందరికి అధికారులు సొమ్ము బ్యాంకులో జమ చేసినట్లు చెబుతున్నారు. కాని తమకు అందలేదని లబోదిబోమంటున్నారు. అసలు సమస్య ఏమిటో అర్థం కావడంలేదు. అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో విన్నవించకున్నా ప్రయోజనం కలగడంలేదంటున్నారు. లబ్ధిదారుల పరిస్థితి ఈవిధంగా ఉండగా ప్రభుత్వ ప్రచారం ఘనంగా కొనసాగుతూనే ఉంది.