కంచ ఐలయ్య అరెస్టు: నా వద్ద గన్ను లేదు, పెన్ను మాత్రమే ఉందని వ్యాఖ్య
ఖమ్మం: సామాజిక స్మగర్లు కోమటోళ్ల రచన ద్వారా తీవ్ర వివాదంలో చిక్కుకున్న రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్యను ఖమ్మం పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి ఆయన ఇక్కడికి వచ్చారు.
మహాసభకు అనుమతి ఉన్నప్పటికీ అందులో పాల్గొనేందుకుఐలయ్యకు అనుమతి లేదని పోలీసులు ముందునుంచీ చెపుతూ వచ్చారు. ఆదివారం మహాసభల ప్రాంగణానికి వెళ్లేందుకు సీపీఎం కార్యాలయం నుంచి తన అనుచరులు, సీపీఎం కార్యకర్తలతో కలిసి రోడ్డుపైకి వచ్చిన ఐలయ్యను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులను అడ్డుకునే ప్రయత్నం
రోడ్డుపైకి వచ్చిన ఐలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని సీపీఎం శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తోపులాట జరిగింది. నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలతో పాటు పోలీసులు భారీగా సీపీఎం కార్యాలయం వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తిరిగి హైదరాబాదుకు పంపించారు..
కంచ ఐలయ్యను కూసుమంచి పోలీస్ స్టేషన్కు తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్ పంపించారు. ఐలయ్యను తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న సీపీఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ప్రభుత్వం భయపడుతోందని ఐలయ్య
తనవద్ద గన్ను లేదని, కేవలం పెన్ను మాత్రమే ఉందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం తనను చూసి భయపడుతోందని ఐలయ్య వ్యాఖ్యానించారు. అరెస్టు సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ సమన్యాయం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అవకాశవాద ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో అంతు చూస్తా...
వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని, టీఆర్ఎస్ నేతల అంతుచూసే వరకు వదలనని అన్నరు. ఐలయ్య అరెస్టును నిరసిస్తూ సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. తమ సభలో పాల్గొనేందుకు వచ్చిన అతిథిని అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసుకునే సభలు, సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉక్కుపాదం మోపుతోందని అన్నారు.