విభజనకు ముందు, నేడు బంగారం సేల్స్పై కంచ ఐలయ్య, అమరావతికి పెట్టుబడిదారులు
హైదరాబాద్: విభజనకు ముందురోజు వరకు హైదరాబాదులో రోజుకు రూ.250 కోట్ల బంగారం వ్యాపారం జరిగితే, నేడు అది రూ.50 కోట్లకు పడిపోయిందని ఓయు రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆదివారం అన్నారు. బషీర్ బాగ్ దేశోద్దారక భవన్లో తెలంగాణలో విద్యా రంగ సంక్షోభం - కర్తవ్యాలు అంశంపై సదస్సు నిర్వహించారు.
ఇందులో కంచ ఐలయ్య మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు చనిపోతుంటే వీరులుగా కీర్తించారని, ఇప్పుడు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఒక్క మంత్రి కూడా వారి కుటుంబాలని పరామర్శించడం లేదని మండిపడ్డారు.
ఈ ఆత్మహత్యలు ఇలాగే కొనసాగితే మరో రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం స్మశాన వాటికలా మారుతుందని హెచ్చరించారు. పెట్టుబడిదారులు హైదరాబాదును వదిలేసి ఏపీ రాజధాని అమరావతికి పయనమవుతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఫ్యూడలిజంలో పడిపోయిందన్నారు.
కెసిఆర్ అయుత చండీయాగానికి ఏర్పాట్లు మొదలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పదకొండు వందల మందికిపైగా రుత్వికులను ఆహ్వానించనున్నారు. శృంగేరి పీఠాధిపతినీ ఆహ్వానిస్తున్నారు.
శృంగేరి పీఠాధిపతి శిష్యులు, కరీంనగర్ జిల్లాకు చెందిన పురాణం మహేశ్వర శర్మ, గోపీకృష్ణ, కర్నూలుకు చెందిన ఫణిశశాంక శర్మ తదితరులు యాగ నిర్వహణ సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోనే యాగాన్ని నిర్వహించనున్నారు.
వ్యవసాయ క్షేత్రంలో సుమారు ముప్పై ఎకరాలకు పైగా భూమిని చదునుచేసే పనులు ప్రారంభించారు. యాగశాల నిర్మాణంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రుత్విక్లు ఉండేందుకు ప్రత్యేకంగా గుడారాలు ఏర్పాటు చేయనున్నారు.
యాగానికి అవసరమైన ఇతర ఏర్పాట్లను చూసేందుకు పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతరులకు అప్పగించారు. మరోవైపు, సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సోమవారం క్షేత్రంలోనే పంటలను పరిశీలిస్తారు. అయుత చండీయాగం ఏర్పాట్లను పరిశీలిస్తారు.