నాకు ప్రాణహాని: డీజీపీని కలిసిన ఐలయ్య, పొలిటికల్ ఎంట్రీపై ఇలా
వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య సోమవారం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. కొందరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన డీజీపీ.. ఎక్కడికైనా వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇ
హైదరాబాద్: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య సోమవారం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. కొందరి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ.. ఎక్కడికైనా వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అనంతరం, కంచ ఐలయ్య మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకూ పోలీసులు బాగా సహకరించారు. నాకు నిరంతర రక్షణ కల్పించాలని డీజీపీని కోరాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్నవాడిని.. తెలంగాణ రాష్ట్రం వాడిని కనుక, సమస్యను నా ప్రభుత్వం దృష్టికి, పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకురావడం నా బాధ్యత' అని చెప్పారు.
అంతేగాక, 'సెప్టెంబర్ 5 నుండి నిన్నటి వరకు నాలుగు పెద్ద ఘటనలు జరిగాయి. ఆ పుస్తకం ఏంటో తెలియకుండా రోడ్ల మీద బడి ఒక మేధావి నాలుక కోస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి.. ఈ విషయం అమిత్ షాకు తెలియకుండా ఉండదు. అసలు, డీమోనిటైజేషనే చాలా పెద్ద సోషల్ స్మగ్లింగ్. దీనిపై చాలాసార్లు నేను వ్యాసాలు రాశాను' అని తెలిపారు.
కాగా, తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాడినని, తెలంగాణ ఉద్యమ సయంలోనే వచ్చేవాడినని ఐలయ్య తెలిపారు. తన గొంతులో ప్రాణముండగా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తనది సోషల్ రిఫార్మ్ అజెండా అని ఐలయ్య పేర్కొన్నారు.