కొట్లాటే, తగ్గేదే లేదు: సుప్రీం తీర్పుపై ఐలయ్య, జొన్నవిత్తుల కౌంటర్
హైదరాబాద్: వివాదాస్పద రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలు అయిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంచ ఐలయ్య మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఈ తీర్పు ద్వారా మరిన్ని రచనలు చేసే అవకాశం కోర్టు తనకు కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు.
దేవుళ్లకు సంబంధించింది కాదు..
కులాల చరిత్ర, సంస్కృతిపై మరింత స్వేచ్ఛగా, రాజ్యాంగ బద్ధంగా పరిశోధనలు చేసే అవకాశం తనకు లభించిందని అన్నారు. కాగా, ఈ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ వీరాజంనేయులు అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పుస్తకాన్ని నిషేధించడమంటే, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని, చట్ట పరిధిలో భావ వ్యక్తీకరణ చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. తాను రాసిన పుస్తకంలో బేసిక్ ఇష్యూ దేవుళ్లకి సంబంధించింది కాదని, ఇది హిందూ మతం గురించి వివరించిన పుస్తకం కానే కాదని కంచ ఐలయ్య అన్నారు.
అసలు సమస్య...
అసలు సమస్య ఎక్కడ వస్తోందంటే, సినిమా రచయితలు, జొన్నవిత్తుల వంటి సినిమా పాటలు రాసుకునేవారు, పీఠాధిపతులు మాత్రమే తన పుస్తకంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మరి ఈ దేశంలోని ఇన్ని యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లు, పరిశోధన చేసే విద్యార్థులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఐలయ్య నిలదీశారు. సినిమా పాటలు రాసుకునే వారు, తన పుస్తకాన్ని వ్యతిరేకించే వారు ఇప్పుడు దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణయాన్ని కూడా తప్పని వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి వారితో తాను చర్చలో పాల్గొనాలా? అని ఎద్దేవా చేశారు.
వారందరితో కొట్లాట ఉంది..
తాను రాసిన పుస్తకాలన్నీ సొంత ఖర్చుతో రీసెర్చ్ చేసి రాసుకున్నవేనని, ఏ క్రిస్టియన్ సంస్థ నుంచి తాను డబ్బులు తీసుకోలేదని.. తనకు ఆ అవసరం కూడా లేదని కంచ ఐలయ్య అన్నారు. తనకు మంచి జీతం వస్తోందని, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా వస్తుందని చెప్పారు. ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఐలయ్య మాట్లాడుతూ, ‘బిషప్స్ ని నేను అడిగా.. ‘మీరు స్థాపించిన కాలేజీలు మూసి వేయండి. మీ ఆస్తులను అమ్మండి, మీకు పట్టణాల్లో ఆస్తులు ఏ దేవుడిచ్చాడు? గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఆదివాసీలకు పాఠశాలలు ఏర్పాటు చేస్తే, అప్పుడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు' అని వారికి చెప్పాను. అలా చెప్పినందుకు వాళ్లతో కూడా నాకు కొట్లాట ఉంది. స్వామీజీలతోనూ నాకు కొట్లాట ఉంది' అని అన్నారు.
పుస్తకం పేరు మార్చేది లేదు..
‘అందరితో కొట్లాట పెట్టుకుని ఏం చేస్తారు?' అనే ప్రశ్నకు ఐలయ్య స్పందిస్తూ.. ‘కొట్లాట పెట్టుకుని ఆఖరికి మట్టిలో కలుస్తా. నేను రాసిన పెన్నును పదివేల సంవత్సరాల పాటు కౌటిల్యుడికి అడ్డంగా నిలబెట్టి పోవాలని చూస్తున్నా. కౌటిల్యుని భరతం పట్టడమే నా లక్ష్యం' అని చెప్పారు. అంతేగాక, తాను తన పుస్తకం(సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు) పేరు కూడా మార్చనని స్పష్టం చేశారు.
ఐలయ్యకు జొన్న విత్తుల కౌంటర్
‘సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు' అనే కంచ ఐలయ్య పుస్తకంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించారు సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని పిటిషనర్లు సరైన విధంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లలేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, ఆ పుస్తకాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛ కింద రాసుకున్నారని సుప్రీంకోర్టు చెప్పింది కానీ, ఆ పుస్తకంలో రాసిందంతా యథార్థం అని ఎక్కడా చెప్పలేదని అన్నారు.
ఐలయ్య పుస్తకం రాసిన విధానం భావస్వేచ్ఛ పరిధిలో ఉన్నదని మాత్రమే చెప్పిందని వ్యాఖ్యానించారు. అందులో భావం.. కులాలను, మతాలను అవహేళన చేసేలా ఉందని జొన్నవిత్తుల చెప్పారు. దీంట్లో ఉన్న విషయాలని స్పష్టంగా సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళితే, దీనివల్ల విద్వేషాలు చెలరేగుతున్నాయని పిటిషనర్లు సరిగా చెబితే అప్పుడు సుప్రీంకోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛ విషయం అంటూ కాకుండా వేరే కోణంలో విచారణ జరిపేదని అన్నారు. కాగా, ఐలయ్య పుస్తకంపై నిషేధం విధించలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. రచయితలు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని హితవు పలకడం గమనార్హం.