శ్రీనివాస్ కూచిభొట్ల-సునయనలు వారికి అమితాబ్-జయాబచ్చన్!
విద్వేషానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని అమెరికాలో జాతి విద్వేషానికి బలైన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్ ద్వారా స్పష్టం చేశారు. ఆమె ఉంచిన పోస్ట్ అందర్నీ కదిలిస్తో
హైదరాబాద్: విద్వేషానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని అమెరికాలో జాతి విద్వేషానికి బలైన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్ ద్వారా స్పష్టం చేశారు. ఆమె ఉంచిన పోస్ట్ అందర్నీ కదిలిస్తోంది.
ఈ పోస్ట్ బుధవారం సాయంత్రానికే ఆరువేల షేర్లు దాటింది. తనకు అండగా నిలిచినందుకు తన స్నేహితులకు, మీడియాకు, మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్లకు, భర్త పని చేసిన కంపెనీ గార్మీన్ సీఈవోకు, తాను పని చేసిన కంపెనీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
శ్రీనివాస్ కూచిభొట్ల - సునయన దంపతులను అమెరికాలోని వారి స్నేహితులు అమితాబ్ - జయలను పోల్చుతూ పిలిచేవారు. సునయన 5 అడుగులు ఉంటుంది. శ్రీనివాస్ కూచిభొట్ల టవర్లా ఆరు అడుగుల 2 ఇంచులు ఉంటాడు
విద్వేశంపై పోరాటం కొనసాగాలి
విద్వేషానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని సునయన స్పష్టం చేశారు. అమెరికాలో పని చేస్తున్న భారతీయుల భద్రతపై ప్రశ్నలు సంధించారు. తన భర్త శ్రీనివాస్కు నివాళులు అర్పిస్తూ ఫేస్బుక్లో ఉంచిన పోస్టులో సునయన తన ఆవేదనను మరోసారి తెలియజేశారు.
వలసదారుల్లో సందేహం
మనం అమెరికాకు చెందుతామా? అన్న సందేహం వలసదారులందరిలోనూ ఉందని సునయన అన్నారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తా లేదా చెడ్డ వ్యక్తా అని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తామని, చర్మం రంగు ఆధారంగా అయితే కాదని పేర్కొన్నారు. మరి మంచీ, చెడులను నిర్ణయంచేదేమిటి? చాలాసార్లు ఈ విషయాలను కొన్ని వారాల పాటు మాట్లాడుకుని మరిచిపోతుంటారు. కానీ ప్రజల మనస్సుల్లోంచి విద్వేషాన్ని పారదోలే దిశగా పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు.
అమెరికా ఏం చేయనుంది?
విద్వేషపూరిత నేరాలను ఆపడానికి అమెరికా ప్రభుత్వం ఏం చేయబోతుందని సునయన చదువరులను కదిలించే ఈ పోస్టులో ఆమె తన భర్త బాల్యం గురించి, ఆయన ఆశలు, స్వప్నాల గురించి వివరించారు. తాను రాసే ఏ ముఖ్యమైన ఈమెయిల్కైనా ఆయనే ఎడిటర్గా ఉండేవారని చెప్పారు.
ఆయనే ఎడిటర్గా ఉండేవారు..
తాను రాసిన ఏ ముఖ్యమైన ఈ మెయిల్కైనా మీరే ఎడిటర్గా ఉండేవారని, కానీ తొలిసారి ఇప్పుడు నా కోసం నేనే ఆ పని చేసుకోవాల్సి వస్తోందని ఆవేదనగా సునయన పేర్కొన్నారు. ప్రపంచ టెక్ పరిశ్రమ నేతలు మానవ హక్కుల రక్షణకు దన్నుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
వారికి థ్యాంక్స్
ట్వీట్ల ద్వారా మద్దతుగా నిలిచినందుకు సత్య నాదెళ్ల, కమలా హ్యారిస్ వంటి వారికి ధన్యవాదాలు అని, మానవహక్కులకు మద్దతు కొనసాగించాలని మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల తదితరులందరికీ తన విజ్ఞప్తి అన్నారు.
మరొకరికి ఈ నష్టం జరగొద్దు
మనం ప్రేమను వ్యాప్తి చేయాలని, విద్వేషాన్ని ఆపాలని పేర్కొన్నారు. ఈ రోజు గార్మిన్ ఉద్యోగికి నష్టం జరిగిందని, మీ ఉద్యోగుల్లో ఎవరికో జరగవచ్చునని, తన కుటుంబానికి కలిగిన కష్టం మరెవరికీ కలగకూడదని సునయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్
శ్రీనివాస్ మృతదేహాన్ని అమెరికా నుంచి హైదరాబద్కు తీసుకురావడానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అమెరికాకు తిరిగి వెళ్లి ప్రస్తుతం పని చేస్తున్న ఇన్టచ్ సొల్యూషన్స్లో ఉద్యోగం కొనసాగించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మనం అమెరికాకు చెందుతామా? మనం కలలుగన్న దేశం ఇదేనా? మన పిల్లలను ఇక్కడ పెంచడం ఇంకా సురక్షితమేనా? అనే ప్రశ్న సంధిస్తూ తన పోస్టును ముగించారు.