కేసీఆర్ గెలుపుపై ఏపీలో సంబరాలు, బీజేపీ బండి సంజయ్ ఓటమితో కేడర్ కంటతడి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు 119 నియోజకవర్గాల్లో పూర్తయింది. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 88 స్థానాలో తెరాస గెలవగా, కాంగ్రెస్ 19, టీడీపీ 2, బీజేపీ ఒకటి, మజ్లిస్ ఏడు స్థానాల్లో గెలవగా, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు భారీ మెజార్టీతో విజయం సాధఇంచారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలు ఓడిపోయారు. జానా రెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఓడిపోయారు. కేసీఆర్ కేబినెట్లోని తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, మహేందర్ రెడ్డిలతో పాటు స్పీకర్ మధుసూదనా చారి ఓడిపోయారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తెరాస గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు ఆనందాల్లో మునిగి తేలుతున్నారు.
టీఆర్ఎస్ గెలుపుపై ఏపీలో సంబరాలు
టీఆర్ఎస్ గెలుపుపై తెలంగాణతోపాటు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలోను సంబరాలు జరిగాయి. పలువురు కేసీఆర్ అభిమానులు మిఠాయిలు పంచుకున్నారు. తెనాలిలో కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్యర్వంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం స్థానికులు కేక్ కోసి, రంగులు చల్లుకున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్ ఖాధీర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయతీ గల నేత అని, నమ్ముకున్న ప్రజలకు మేలు చేసినందునే ప్రజలు మళ్లీ గెలిపించారన్నారు.
బండి సంజయ్ ఓటమిపై కార్యకర్తల కంటతడి
బీజేపీ దాదాపు ఏడు నుంచి పది చోట్ల గెలుస్తుందని చాలా మంది భావించారు. ఇందులో గోషామహల్, అంబర్పేటలతో పాటు కరీంనగర్లో బండి సంజయ్ గెలుపుపై అందరూ ధీమాగా ఉన్నారు. ఆయన గెలుపుపై రాష్ట్రస్థాయి పార్టీ కేడర్ కూడా విశ్వాసం పెట్టుకుంది. కానీ అతను కేవలం 14వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.
బండి సంజయ్కు స్థానికంగా ఎంతో మంచి పేరు ఉంది. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండే ఆ నేత గెలుస్తాడని ఎందరో భావించారు. కానీ అనూహ్యంగా ఓటమి చవి చూశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కంటతడి పెట్టారు. ఓ కార్యకర్త ఏడవగా.. బండి సంజయ్ ఆయనను ఊరకుంచి, ఆయన కూడా కళ్ల నుంచి నీళ్లు వస్తున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి ముందుకు కదిలారు.
{document1}