పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం... బీజేపీ నేత అరెస్ట్... న్యాయం చేయాలంటున్న బాధితురాలు..
కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావును శుక్రవారం(అక్టోబర్ 9) పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో తనను మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడని.. ఆయన నుంచి తనకు ప్రాణ హాని ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాస సత్యనారాయణ రావును అరెస్ట్ చేసిన పోలీసులు... అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం సత్యనారాయణకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
బాస సత్యనారాయణ రావు తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఇటీవల బాధితురాలు మాట్లాడిన కొన్ని వీడియోలు కరీంనగర్లో కలకలం రేపాయి. తానూ ఓ బీజేపీ కార్యకర్తనే అని ఆ వీడియోలో ఆమె పేర్కొనడం గమనార్హం. సత్యనారాయణ రావు మోసం చేశారని పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని వీడియోలో ఆమె ఆరోపించారు.
తాను డబ్బుల కోసమే బ్లాక్మెయిల్ చేస్తున్నానని కొంతమంది మాట్లాడుతున్నారని... అందులో నిజం లేదని చెప్పారు. తన ఆడియోలు,వీడియోలు ఉన్నాయని సత్యనారాయణ రావు బెదిరింపులకు గురిచేస్తున్నారని... ఆయనతో తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు. తనకు ఎవరూ అండగా నిలవట్లేదని... దయచేసి తనకు న్యాయం చేయాలని కోరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్తోనూ బాధితురాలు మాట్లాడినట్లుగా ఓ వీడియో వెలుగుచూసింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎంపీకి వివరించిన బాధితురాలు... తనకు న్యాయం చేయాలని కోరింది. బాస సత్య నారాయణ రావు వ్యవహారం కరీంనగర్ జిల్లా రాజకీయంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.