యువతిపై రేప్: కరీంనగర్ కోర్టు సంచలన తీర్పు
కరీంనగర్: కరీంనగర్లో ఓ యువతిపై అత్యాచారం కేసులో కరీంనగర్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5వేల చొప్పున జరిమానా విధించింది.
2013 ఏప్రిల్ 18న బెల్లంపల్లికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల(2013) క్రితం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతి పెద్దపల్లిలోని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్కు వచ్చి పాట్నా ఎక్స్ప్రెస్ ఎక్కింది.
రైలు పెద్దపల్లిలో ఆగదని తెలుసుకుని రామగుండంలో దిగింది. మరో రైలు కోసం విశ్రాంతి గదిలో నిరీక్షిస్తున్న సమయంలో రామగుండంలోని భరత్నగర్కు చెందిన మహ్మద్ సమీర్ (20) అలియాస్ అఖిల్ అక్కడికి వచ్చి ఆమెతో పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడు. సమీపంలోని పార్కు ఉందని అక్కడ కూర్చుందామని తీసుకువెళ్లాడు.
యువతికి తెలియకుండా సమీర్ తన స్నేహితునికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. దీంతో అక్కడికి చేరుకున్న రాజ్కుమార్ (22) అనే యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో సమీపంలోని వారు అక్కడికి వచ్చేలోపు వారిద్దరు అక్కడ నుంచి పారిపోయారు.
యువతి ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఉదయ్కుమార్ దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో సాక్షులను విచారించిన కరీంనగర్ జిల్లా ఐదో అదనపు సెషన్స్ న్యాయమూర్తి నాగరాజు శుక్రవారం ఇద్దరు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.