గులాబీకి కలిసొచ్చిన కరీంనగర్లో ఏమైంది.. కారు ఎందుకు పల్టీ కొట్టింది...!
కరీంనగర్ : కరీంనగర్ గడ్డ టీఆర్ఎస్కు కలిసొచ్చిన అడ్డా. గులాబీ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తలపెట్టిన కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ 2001లో సింహగర్జన సభ తొలిసారిగా నిర్వహించింది ఇక్కడే. ఇటీవలి లోక్సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడినుంచే సన్నాహాక సభలు నిర్వహించడం.. ఆ తర్వాత తొలి బహిరంగ సభకు కరీంనగరే వేదిక కావడం విశేషం. అంతలా కరీంనగర్ గడ్డను సెంటిమెంట్గా భావించే గులాబీవనానికి.. ఇక్కడి పార్లమెంటరీ స్థానాన్ని చేజార్చుకోవడం నిజంగా చేదు అనుభవమే.
టీఆర్ఎస్ సక్సెస్ కోట కరీంనగర్..! ఇప్పుడేమైంది?
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. కరీంనగర్ గడ్డను కలిసొచ్చిన అడ్డాగా ఫీలవుతారు. టీఆర్ఎస్ ఉద్యమం ప్రస్థానంలో ఇక్కడి నుంచి పోటీచేసి ఆయన ఎంపీగా గెలుపొందారు. 2001లో సింహగర్జన గానీ, ఇతర ఏ కార్యక్రమాలైనా గానీ టీఆర్ఎస్కు సక్సెస్ మిగిల్చాయి. 2019 లోక్సభ ఎన్నికల వేళ కూడా.. టీఆర్ఎస్ తలపెట్టిన సన్నాహాక సదస్సులకు కరీంనగర్ నుంచే బీజం పడింది. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు.
అదలావుంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి బహిరంగ సభ కూడా కరీంనగర్ గడ్డపైనే నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరీంనగర్ గడ్డపై ఆయనకున్న సెంటిమెంట్ ఏంటో దాన్నిబట్టి అర్థమైంది. చాలా సందర్భాల్లో కరీంనగర్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. చిన్నప్పటి నుంచి జిల్లాతో అవినాభావ సంబంధం ఉందని గుర్తుచేశారు.
బాప్రే బాప్.. బీజేపీలో బండి సంజయే తోపు.. ఈసారి కూడా..!
టీఆర్ఎస్ హవాలో సైతం గట్టి దెబ్బ..!
కరీంనగర్ గడ్డను సెంటిమెంట్గా భావించే కేసీఆర్కు ఈసారి గట్టి ఝలక్ ఇచ్చింది. లోక్సభ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం ఆ పార్టీశ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ హవా ఉన్నా కూడా.. కలిసొచ్చిన కరీంనగర్ ఈసారి దెబ్బకొట్టింది. ఇక్కడి పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీకి భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయి.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అనూహ్యంగా లోక్సభ బరిలో నిలిచి ఎంపీగా గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో 14 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఒక కరీంనగర్ సెగ్మెంట్లోనే ఆయనకు దాదాపు 50 వేలకు పైగా మెజార్టీ దక్కడం గమనార్హం.
కేసీఆర్ వ్యాఖ్యలు కొంపముంచాయా?.. ఆ ఏడుగురి మధ్య సయోధ్య లేదా?
కరీంనగర్ పార్లమెంటరీ స్థానం కచ్చితంగా తమదేనన్న ధోరణిలో ఉన్నారు గులాబీ నేతలు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కొంప ముంచిదనే వాదనలు లేకపోలేదు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా కూడా కరీంనగర్ పార్లమెంటరీని చేజార్చుకోవడం చర్చానీయాంశమైంది. ఆ ఏడుగురి మధ్య సయోధ్య లేకపోవడం వల్లే ప్రతికూల ఫలితం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
ఇక గ్రామీణ ఓటర్లపై ఆశలు పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్ నేతల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఇక సీఎం కేసీఆర్ కరీంనగర్ గడ్డపై.. హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటూ కామెంట్ చేయడం పెద్ద మైనస్గా మారిందని చెప్పొచ్చు. ఆ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. కేసీఆర్ మాట్లాడిన తీరును యువత కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. దానికి టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వకపోగా.. సంక్షేమ పథకాలను నమ్ముకుని ప్రచారంలో కాస్తా వెనుకబడ్డట్లు వార్తలొచ్చాయి.
ఇక మిగిలింది పోస్టుమార్టమే..!
కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పొరుగు నియోజకవర్గాలైన నిజామాబాద్, ఆదిలాబాద్ పై కూడా పడిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ జెండా రెపరెపలాడింది. మొత్తానికి టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావించిన కరీంనగర్ స్థానం కోల్పోవడం మాత్రం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేని అంశం.
సారు.. కారు.. పదహారు అంటూ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతలు తెగ హడావిడి చేసినా.. ఫలితాలు మాత్రం 9 స్థానాలకే పరిమితం అయ్యాయి. దాంతో లోక్సభ ఎన్నికల ఫలితాల సరళిపై టీఆర్ఎస్ అధిష్టానం పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.