దాడి: జాతీయ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ ఫిర్యాదు, కేసీఆర్పై నిప్పులు
న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కేంద్ర మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఇటీవల కరీంనగర్లో తనపై పోలీసులు దాడికి దిగారని.. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకులు కుక్కలకన్నా హీనంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హత్యకు గురైన తహసీల్దార్ విజయారెడ్డి మృతిపై కేసీఆర్ కసాయి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.
ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, కొండగట్టు మరణాలపై స్పందించని కేసీఆర్ తన ఫాం హౌస్లో కుక్క చనిపోతే మాత్రం స్పందించారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ, రైతుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేసీఆర్కు ఎందుకంత ఆతృత అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులవి ఆత్మహత్యలు కాదని.. కేసీఆర్ చేసిన హత్యలుగా భావిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదంటూ నిలదీశారు.
కేసీఆర్కు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమాన్ని నిర్మిస్తామని ఎంపీ బండి సంజయ్ అన్నారు. హుజూర్నగర్లో డబ్బులను ఏరులైపారించి టీఆర్ఎస్ గెలిచిందని సంజయ్ ఆరోపించారు.
ఇది ఇలావుండగా, కరీంనగర్ పోలీసు అధికారులపై ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పోలీస్ అధికారి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై చేయి చేసుకోవడాన్ని అరవింద్ తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. వెంటనే డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కాబట్టి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆ అధికారులను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదని అరవింద్ మండిపడ్డారు. నిన్నటి వరకు బీజేపీ కార్యకర్తలు , నాయకుల మీద కక్ష సాధింపు చర్యలుగా తప్పుడు కేసులు బనాయించి వేధించిన పోలీసులు.. ఏకంగా కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.