తెలంగాణ బీజేపీ సారథిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ: పరిమితంగా
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సాదాసీదాగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పరిమితంగా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బండి సంజయ్.. ప్రస్తుతం కరీంనగర్ లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలను అప్పగిస్తూ ఇదివరకే బీజేపీ అధిష్ఠానం ఆదేశాలను జారీ చేసింది. నిజానికి- ఈ కార్యక్రమాన్ని నిజాం గ్రౌండ్స్లో ఆడంబరంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. బాధ్యతల స్వీకరణకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి సహా పలువురు జాతీయ స్థాయి సీనియర్ నాయకులను తెలంగాణ బీజేపీ నేతల ముందస్తు ప్రణాళికలను రూపొందించుకున్నారు.
Recommended Video
లాక్డౌన్ ముగిసిన తరువాతైనా బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకోవాలని భావించారు. వైరస్ ప్రబలిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్సింగ్ను అనుసరించాల్సి రావడం, ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటానికి అవకాశం లేకపోవడం పైగా లాక్డౌన్ గడువు పొడిగించే అవకాశాలు ఉండటం వంటి కారణాల వల్ల సాదాసీదాగా దీన్ని పూర్తి చేశారు. బాధ్యతలను స్వీకరించిన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రాండ్గా జరుపుకోవచ్చనే అభిప్రాయం తెలంగాణ బీజేపీ నేతల్లో వ్యక్తమౌతోంది.
ఈ సంద్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. బండి సంజయ్ బాధ్యతలను స్వీకరిస్తోన్న ఫొటోను ఆయన తన ట్వీట్కు జత చేశారు. బండి సంజయ్కు తన తరఫున, జన సైనికుల తరఫున పార్టీ నాయకులందరి తరుపున మనః పూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాన్ని కొనసాగిస్తామని పవన్ కల్యాణ్ ఇదివరకే వెల్లడించారు.