కరీంనగర్ రాధిక హత్య కేసు : క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్.. ఏం తేలింది..?
కరీంనగర్లో హత్యకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని ముత్తా రాధిక(16) కేసు ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా రాధిక తండ్రితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు రాధికా ఫోన్ కాల్ డేటా, కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. రాధిక హత్య బయటి వ్యక్తుల పనికాదని.. తెలిసినవాళ్లు లేదా కుటుంబ సభ్యులే చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.
క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్..
విచారణలో భాగంగా రాధిక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదివారం వెంకటేశ్వర కాలనీలోని అతని ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు.. సీన్ రీకన్స్ట్రక్షన్తో పోలీసులు కేసుపై ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. కరీంనగర్ సీపీ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అకాశం ఉంది.
ఎలా జరిగింది..
కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్లో పద్మావతి ఫంక్షన్ హాల్ వెనక ఉన్న ఇంట్లో ముత్తా రాధిక ఫిబ్రవరి 10న హత్యకు గురైంది. కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన ఆమె తల్లిదండ్రులు కూతురు హత్యకు గురైనట్టు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. రాధిక గొంతు కోసి హత్య చేసినట్టుగా నిర్దారించారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడే రాధికను హత్య చేసి ఉంటాడని మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంట్లో అద్దెకు ఉండే యువకుడి పనేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
రాధిక కుటుంబ నేపథ్యం
రాధిక తల్లిదండ్రులు కొమురయ్య-ఓదెమ్మ.సోదరుడు వేణు. అతను ప్రస్తుతం హైదరాబాద్లో ఎంసీఏ చదువుతుండగా, రాధిక కరీంనగర్లోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఓదెమ్మ భవన నిర్మాణ కూలీగా, కొమురయ్య గోడౌన్లో కూలీగా పనిచేస్తున్నారు. రోజు లాగే తల్లిదండ్రులు ఇద్దరు ఈ నెల 10న ఉదయం కూలీ పనులకు వెళ్లగా.. ఇంట్లో రాధిక చదువుకుంటోంది. సాయంత్రం పూట తమ ఇంటి సమీపంలో నివసించే మనోజ్(9) అనే బాలుడు ఆడుకునేందుకు రాధిక ఇంటికి వెళ్లగా అక్కడ ఆమె రక్తపు మడుగులో పడి ఉందని తల్లిదండ్రులు వెల్లడించారు.
తెలిసినవాళ్ల పనేనా..?
రాధిక చిన్నతనంలోనే పోలియోకి గురైంది. దీంతో లక్షల రూపాయాలు ఖర్చు చేసి ఆమెను బాగుచేసుకున్నాం అని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ బిడ్డను ఎవరు చంపారో ఎందుకు చంపారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంటి చుట్టూ కాంపౌండ్ గోడ ఉండటం, కొత్త వారు ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రాధిక హత్య తెలిసినవారి పనే అయి ఉండవచ్చునని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.