ఆ గట్టున నలుగురు.. ఈ గట్టున ఒక్కరు.. కరీంనగర్ రాజకీయ ముఖచిత్రం..!
కరీంనగర్ : ఆ గట్టున నలుగురు ఉన్నారు. ఈ గట్టున ఒక్కరే ఉన్నారు. ఇది కరీంనగర్ రాజకీయ ముఖ చిత్రం. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా నడుస్తున్న ఉద్యమాల పురిటిగడ్డ పోరు మరోసారి చర్చానీయాంశమైంది. ఒకే ఒక్కడిని ఎదుర్కొనేందుకు నలుగురు మంత్రులను సీఎం కేసీఆర్ మోహరించారనే ప్రచారం జోరందుకుంది. ఆ ఒక్కడు ఎంపీ బండి సంజయ్ కాగా.. ఆ నలుగురేమో మంత్రులు కావడం గమనార్హం.
కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ సత్తా చాటిన బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గులాబీ దండు రెడీ అవుతోంది. ఆ క్రమంలో గులాబీ పరిమళమా.. లేదంటే కమలం వికాసమా అనే రీతిలో కరీంనగర్ పాలిటిక్స్ చర్చానీయాంశంగా మారాయి.
కరీంనగర్ పోరు గడ్డ.. టీఆర్ఎస్ ఇలాకా..!
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. ఉద్యమాల పోరు గడ్డగా ప్రసిద్ధిగాంచిన కరీంనగర్.. టీఆర్ఎస్ పార్టీని ఆదరించింది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పార్లమెంట్కు కూడా పంపించింది. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. టీఆర్ఎస్కు అచ్చొచ్చిన, కలిసొచ్చిన గడ్డగా కరీంనగర్ ముద్ర వేసుకుంది. అయితే ఇదంతా కూడా మొన్నటి పార్లమెంటరీ ఎన్నికలకు ముందు పరిస్థితి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ బోల్తా కొట్టింది. కాషాయం జెండా రెపరెపలాడింది.
కేసీఆర్ వ్యాఖ్యలే దెబ్బ కొట్టాయా?.. బీజేపీ వాడుకుందా?
మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలిచారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అతడి చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందు కరీంనగర్ పార్లమెంటరీ స్థానం కారు ఖాతాలోనికే అని భావించిన టీఆర్ఎస్ పెద్దలు.. ఆ తర్వాత ఫలితాలు చూసి షాకయ్యారు. టీఆర్ఎస్ కంచుకోటగా భావించిన కరీంనగర్లో పార్టీ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
లోక్సభ ఎన్నికల వేళ కరీంనగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన హిందూగాళ్లు, బొందుగాళ్లు అనే కామెంట్స్ టీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్గా మారాయనే టాక్ జోరుగా వినిపించింది. ఆయన వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు సీరియస్గా తీసుకుని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అది కాస్తా గ్రామాగ్రామానికి పాకి ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ కొట్టిందనే వాదనలు లేకపోలేదు.
కరీంనగర్లో ఓటమి టీఆర్ఎస్ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారా?
కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పొరుగున ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానాలపై కూడా పడిందనే ప్రచారం చక్కర్లు కొట్టింది. అదే క్రమంలో ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. నిజామాబాద్ నుంచి కేసీఆర్ తనయ కవిత ఓడిపోవడం చర్చానీయాంశమైంది.
అదంతా జీర్ణించుకోలేని టీఆర్ఎస్ పెద్దలు కరీంనగర్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కొత్త స్కెచ్చులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో రెండు మంత్రి పదవులు కట్టబెట్టడం హాట్ టాపికైంది. తొలి కేబినెట్లో జిల్లా నుంచి ఈటల రాజేందర్కు.. కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవులు కట్టబెట్టిన సీఎం కేసీఆర్ మలివిడతలో కేటీఆర్తో పాటు గంగుల కమలాకర్కు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కడిని ఎదుర్కొనేందుకు నలుగురు మంత్రులా అనే వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందర్భాలు అనేకం.
ఆ గట్టున నలుగురు అందుకేనా?
కరీంనగర్ గడ్డను తమ ఇలాకాలా భావించే టీఆర్ఎస్ పార్టీ నేతలు.. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ పట్టు కోల్పోవడం జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే కరీంనగర్లో పార్టీకి పునర్వైభవం తెప్పించేలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ నేపథ్యంలోనే జిల్లాకు నాలుగు మంత్రి పదవులు కట్టబెట్టారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఆ గట్టున ఒక్కరు.. ఈ గట్టున నలుగురు అన్న చందంగా కరీంనగర్ రాజకీయ ముఖచిత్రం యూటర్న్ తీసుకుంటోంది.
తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడించడానికి ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. 2023 ఎన్నికల నాటికి తెలంగాణలో రాజ్యాధికారం మాదే అన్నట్లుగా కాషాయం పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎదగకుండా చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి భవిష్యత్తులో ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ ఎలా ఉంటుందనేది చూడాలి.