వ్యూహాత్మకం: కుమారస్వామికి కేసీఆర్ ప్రశంస, జేడీఎస్ అధినేత ఆలయాల సందర్శన
హైదరాబాద్: కర్ణాటక రాజకీయ పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించారు. కర్ణాటక శాసనసభలో బీజేపీ బలపరీక్షలో నెగ్గకుండా జేడీఎస్ అధినేత కుమారస్వామి వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశంలో ప్రాంతీయ పార్టీ సత్తా చాటారని కితాబిచ్చారు. తాము కొత్తగా ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావానికి జేడీఎస్ విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
కాగా, కర్ణాటకలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ముందే పలు దేవాలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య నేతృత్వంలో నియమించిన సమన్వయ కమిటీ ఆదివారం సమావేశం అవుతోంది. దీనికి కుమారస్వామి హాజరవుతారు.
అనంతరం తన వర్గం ఎమ్మెల్యేలను ఉంచిన హోటల్కు వెళ్లి వారితో కాసేపు మాట్లాడుతారు. అనంతరం తన సోదరుడు రేవణ్ణతో కలసి తమిళనాడుకు బయలుదేరుతారు. తిరుచ్చి చేరుకుని శ్రీరంగం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కుమారస్వామి తిరుమలకు వెళ్తారని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, తన ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఆహ్వానించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో తిరుమల పర్యటన ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు.