ఎవరీ కర్ణాటక లోకాయుక్త?: కరీంనగర్ నుంచి కర్ణాటక దాకా..
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని రోజు రోజుకు ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఆయన కుమారుడు అశ్విన్ రావ్ రూ. కొటి లంచం ఇవ్వాలని ఒక ప్రభుత్వ అధికారిని డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శ్రీరాంపురకు చెందిన వై భాస్కర్ రావ్ కర్ణాటక లోకాయుక్తగా పని చేస్తున్నారు. 1999లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2000 మార్చి 9 నుండి 2000 జూన్ 26వ తేది వరకు కర్ణాటక హై కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేసి రిటైడ్ అయ్యారు.
అనంతరం పలు కీలకమైన పదవులలో కొనసాగారు. తరువాత ఆంధ్రప్రదేశ్ హ్యుమన్ రైట్స్ కమిషనర్ గా పని చేశారు. ఆ తర్వాత నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ సభ్యుడిగా పని చేశారు. 2013 ఫిబ్రవరి 13వ తేదిన కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తిగా అప్పటి గవర్నర్ హెచ్.ఆర్. భరద్వాజ్ ప్రమాణస్వీకారం చేయించారు.
భాస్కర్ రావ్ కు హైదారబాద్ లోని ఆదర్శ నగర్ లో సొంత ఇళ్లు, బ్యాంకు అకౌంట్లు, కరీంనగర జిల్లాలోని శ్రీరాంపురలో పొలాలు ఉన్నాయి. భాస్కర్ రావ్ కు భార్య వై. అరుణ, కుమారుడు అశ్విన్ రావ్ ఉన్నారు. వీరికి హైదరబాద్ లో ఆస్తులు ఉన్నాయి.
తన కుమారుడు అశ్విన్ రావ్ కు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ రావ్ అంటున్నారు. తన కుమారుడు అశ్విన్ రావ్ రూ. ఒక కోటి లంచం డిమాండ్ చెయ్యలేదని అంటున్నారు. తప్పు చేశాడని వెలుగు చూస్తే అశ్విన్ రావ్ శిక్ష అనుభవిస్తాడని, చట్టం నుండి ఎవ్వరు తప్పించుకోలేరని భాస్కర్ రావ్ ఇప్పటికే చెప్పారు.