ఆంధ్రా కోవర్టులంతా మహానాడులో: టీటీడీపీ నేతలపై కర్నె తీవ్ర వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణలో ఉన్న ఆంధ్రా కోవర్టులంతా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగిన మహానాడుకు హాజరయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా నాయకులకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
తిరుపతిలో జరిగిన మహానాడులో పాల్గొన్న తెలంగాణ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ఇంద్రవెల్లి దాకా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై కర్నె మండిపడ్డారు.
టీటీడీపీ నాయకులు ఆలీబాబా అరడజను దొంగల్లా మారారని, మహానాడు సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా నేతలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవని భయపడుతున్నటీటీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో పావులుగా మారారని దుయ్యబట్టారు.
పాలమూరు నుంచి వలసలు వెళ్లడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కారణం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారో, ఆంధ్రా పచ్చగా ఉండాలని కోరుకుంటారో తేల్చుకోవాలని అన్నారు. తెలంగాణలో టీడీపీ నేతలు పాదయాత్రలు కాదు కదా, మోకాళ్ల మీద యాత్రలు చేసినా ఆ పార్టీకి పుట్టగతులుండవని అన్నారు.
రెండు రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్వే: ఈటెల
తెలంగాణకు కేటాయించిన రెండు రాజ్యసభ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు.
ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరమని, ఏ పార్టీకి అంత బలం లేనందున ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుందని వెల్లడించారు. మంగళవారం ఉదయం టీఆర్ఎస్ పార్టీ తరుపున కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేస్తారని, ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు.