సనత్నగర్లో టీడీపీలోకి, చంద్రబాబు దుమ్ముదులిపిన కర్నె
హైదరాబాద్: భాగ్యనగరంలోని సనత్ నగర్ లోక్సత్తా పార్టీ ఇంఛార్జ్, కార్యకర్తలు గురువారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారని తెలుస్తోంది. త్వరలో సనత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగే అవకాశముంది. ఈ సమయంలో వారు టిడిపిలోకి వచ్చారు.
చంద్రబాబుపై కర్నె ఆగ్రహం
చంద్రబాబు సీడబ్లూసీకి లేఖ రాయడంపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో కరువు పోవాలని కేసీఆర్ కృషి చేస్తున్నారని, గతంలోనే పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణం కోసం టీఆర్ఎస్ పోరాడిందని చెప్పారు.
పాలమూరు వలసలకు చంద్రబాబే కారణమన్నారు. బాబు జిల్లాను దత్తత తీసుకొని పాలమూరును వలసల జిల్లాగా మార్చాడన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి తట్టుకోలేక చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం ఎడారిలా మారాలని సీడబ్లూసీకి లేఖలు రాస్తున్నారని, పాలమూరు, డిండి ప్రాజెక్టులు కట్టొద్దని చంద్రబాబు లేఖ రాస్తున్నారని ఆరోపించారు. 2008లోనే డిండికి అనుమతులు లభించినా 8 ఏళ్లయినా పట్టించుకోలేదన్నారు. డిండి ఎత్తిపోతల విషయంలో చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడన్నారు.
2013లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి వచ్చిందన్నారు. కొత్త ప్రాజెక్టు ఏదైనా ఉంటే అది పట్టిసీమ ప్రాజెక్టు మాత్రమేనని, విభజన చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడన్నారు. పట్టిసీమ సహా ఆంధ్రాలో చేపట్టే ప్రాజెక్టులు దేనికీ అనుమతి లేదన్నారు.
పోతిరెడ్డిపాడు పెద్ద నదిలా మార్చి నీళ్లు తీసుకుని పోతుంటే నిస్సహాయంగా ఉండిపోయామని, మీ లెక్కల ప్రకారం 30-35 లక్షల మంది సీమాంధ్రులు హైదరాబాద్లో నీళ్లు తాగాలన్న విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. హైదరాబాదులోని ఆంధ్రావాళ్లు నీళ్లు ప్రత్యేకంగా తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు.
ఇంజనీరింగ్ కళాశాలలపై కుట్ర: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గురువారం మండిపడ్డారు. కెజి టు పిజి విద్య కేవలం నినాదంగానే మిగిలిపోయిందన్నారు. పుష్కరాలకు బస్సు ఛార్జీలు పెంచి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్సుమెంట్స్ తగ్గించుకునేందుకే ఇంజనీరింగ్ కళాశాలల పైన కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కౌన్సెలింగ్ ఆలస్యమవుతుండటంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని చెప్పారు.