కెటిఆర్ చెప్పినట్లే 100 సీట్లెలా వచ్చాయి: కార్తీక రెడ్డి, హరీష్ని బహిష్కరించారు: రేవంత్
హైదరాబాద్/మెదక్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని, లేకుంటే తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పినట్లే దాదాపు వంద సీట్లు రావడం అనుమానాలు కలిగిస్తోందని మాజీ మేయర్, కాంగ్రెస్ నేత బండ కార్తీక రెడ్డి ఆదివారం అన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని కార్తీక రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కూడా ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ వంద డివిజన్లు గెలుస్తుందని కేటీఆర్ చెప్పినట్లే ఫలితాలు రావడం అనుమానాలు కలిగిస్తోందన్నారు.
కాంగ్రెస్, బిజెపి, టిడిపి శ్రేణులు బలంగా ఉన్న చోటా టిఆర్ఎస్ గెలుపు తమకు విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. కొన్ని డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులకు వారి సొంత ఓట్లే రాకపోవడం, ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనడానికి నిదర్శనమన్నారు.
ఈవీఎంలలో నోటా మీటను తొలగించడం అనుమానాస్పదంగా మారిందన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసిన 150 మంది అభ్యర్థులతో సమావేశమై ఈవీఎంల అవకతవకలపై అభ్యర్థుల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు.
జిహెచ్ఎంసి మాదిరే మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందని తాము భావిస్తున్నామని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని లేదంటే ఈవీఎంలకు ప్రింటర్ను అమర్చాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదు చేస్తాం: ఎర్రబెల్లి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ప్రతి బూత్లో కారు గుర్తుకు ఓటు పడేలా చేశారని తెలంగాణ టిడిపి శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, అలాగే కోర్టుకు వెళ్తామన్నారు.
రాష్ట్రాన్ని 60 నెలలు పాలించేందుకు ప్రజలు టిఆర్ఎస్కు అధికారమిస్తే ఇరవై నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలంగాణ టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామంటూ హరీశ్ రావు.. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోని క్యాబేజీ పూలు తెచ్చి ఇక్కడి ప్రజల చెవుల్లో పెడుతున్నారన్నారు. ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
హరీశ్ రావు సిద్దిపేటవాసి కాదని, కరీంనగర్ జిల్లాకు చెందిన వారని మెదక్ జిల్లాకు ఇల్లరికం వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసి ఎన్నికల్లో నగర బహిష్కరణకు గురయ్యారని, నేడు ఎంపీ కవిత.. కేసీఆర్ వారసుడు కేటీఆర్ అని ప్రకటించడం చూస్తే ఈ విషయం అర్థమవుతోందన్నారు.