కేసీఆర్ ఆదేశాలను ధిక్కరించిన కవిత.. ప్రత్యర్థులకు అస్త్రం.. టీఆర్ఎస్కు పరేషాన్..
ఓవైపు ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్న సంగతి తెలిసిందే. వైరస్ నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణలోనూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రెస్మీట్స్ ద్వారా ప్రజలకు సమాచారం,సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో పబ్లిక్ ఫంక్షన్లను రద్దు చేసుకోవాలని.. ఎక్కువమంది ఒకేచోట గుమిగూడ వద్దని కేసీఆర్ పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ ఆదేశాలను ఆయన తనయ కవితనే ధిక్కరించడం గమనార్హం.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ కవిత హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక విందు ఇచ్చారు. టీఆర్ఎస్ జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,కార్పోరేటర్లు,కౌన్సిలర్లు చాలామంది విందుకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు లీకై బీజేపీ చేతికి చిక్కింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి.. కవిత ఇచ్చిన పార్టీకి 500 పైచిలుకు మంది వచ్చినట్టు ఆరోపించారు. ఓవైపు పెళ్లిళ్లు,పబ్లిక్ ఎగ్జామ్స్ రద్దవుతున్న తరుణంలో మాజీ ఎంపీ కవిత ఇలాంటి పార్టీల ద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు కొని తెస్తున్నారని ఆరోపించారు.
ఓవైపు ఆరోగ్యశాఖ మంత్రి కూడా పెళ్లిళ్లకు 200 మంది కంటే తక్కువమంది వచ్చేలా చూసుకోవాలని పదేపదే విజ్ఞప్తి చేస్తుంటే.. మాజీ ఎంపీ కవిత మాత్రం ఇలా 500 మందితో పార్టీ ఇవ్వడమేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ అరవింద్ ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో పలువురు నెటిజెన్స్ కూడా కవిత తీరును తప్పు పట్టారు. ఇలాంటి తరుణంలో బాధ్యతాయుతంగా,జాగ్రత్తగా మెలగాల్సిందిపోయి.. ఇంత నిర్లక్ష్యమేంటని నిలదీస్తున్నారు.
ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చిన కాగజ్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా.. తనకేమీ పట్టనట్టుగా పబ్లిక్ ఈవెంట్స్కు హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజులు క్వారెంటైన్లో ఉండాలన్న ఆంక్షలున్నా.. అవేవీ ఆయనకు పట్టలేదు. ఆఖరికి కలెక్టర్ జోక్యం చేసుకుని ఆయన్ను క్వారెంటైన్లో పెట్టమని చెబితే గానీ.. ఎమ్మెల్యే స్వీయ నిర్బంధంలోకి వెళ్లలేదు. ఓవైపు ప్రజల ప్రాణాల గురించి కేసీఆర్ అన్ని జాగ్రత్తలు చెబుతుంటే.. సొంత పార్టీ నేతలే సీఎం ఆదేశాలను ధిక్కరిస్తుండటం పార్టీకి లేని పరేషాన్ తీసుకొచ్చినట్టయింది.
Weddings to Public Exams cancelled across country. The footage is a political campaign organised by Ms.Kalvakuntla kavitha, daughter of CM of Telangana, for her mere MLC election, risking more than 500people &their families(exponential if their social contacts are considered). pic.twitter.com/vkbyVFYBie
— Arvind Dharmapuri (@Arvindharmapuri) March 21, 2020