బీజేపీకి అంత సీన్ లేదు: కవిత, డిమాండ్ చేశాం కానీ: సెప్టెంబర్ 17పై నాయిని ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణలో విస్తరించాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి అంతసీన్ లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం నాడు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించడంపై కవిత స్పందించారు.
మతపరమైన విషయాలు ఎక్కడ కనిపించినా తాము విస్తరించే అవకాశాలను వెతుక్కోవడం బిజెపికి అలవాటు అని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ ఆ పార్టీ ప్రవర్తన మారలేదన్నారు. ఇది విలీన దినమే కానీ, విమోచన దినం కాదన్నారు.
ఇదే విషయం తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తరువాత 1948 సెప్టెంబర్ 17న పోలీసు చర్యతో హైదరాబాద్ రాష్ట్రం భారతావనిలో కలిసిన విషయం తెలిసిందే. దీనిని విమోచన దినంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవాలు జరపాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
ఇది విలీన దినమేనని తెరాస చెబుతోంది. భారత దేశంలో ఎన్నో సంస్థానాలు విలీనం అయ్యాయని, ఇప్పుడు వెనక్కు వెళ్లి, ఉత్సవాలు జరుపుకుని, ఏం సాధించాలని భావిస్తున్నారని కవిత ప్రశ్నించారు. కేవలం 1948 నాటి ఘటనలను మాత్రమే బిజెపి గుర్తు చేసుకుంటోందని, ఆ తర్వాత 1952, 1969, 2001లో జరిగిన ఉద్యమాల మాట ఏమిటన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విమోచన దినాన్ని ఎందుకు జరపలేదని నిలదీశారు.
హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వేరుగా మాట్లాడుతూ.. తాము తెలంగాణ ఉద్యమం సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయం నిజమేనని, కానీ తాము అధికారంలోకి వస్తే , సెప్టెంబర్ 17ను నిర్వహిస్తామని తాము ఎప్పుడు చెప్పలేదన్నారు.\