విజయశాంతి అందుకే ఓడిపోయారు, అలా చెప్తున్నారు కానీ: కవిత, చంద్రబాబు-హరీష్లపై ఇలా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. హరీష్ రావు భవిష్యత్తు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేసిన విమర్శలు, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చేస్తున్న విమర్శలు తదితర అంశాలపై మాట్లాడారు.
చదవండి: దొరా.. గమనిస్తున్నా, సర్వస్వం అప్పగించా: విజయశాంతి, కూలిన వేదిక, కిందపడిన రాములమ్మ
హరీష్ రావు గురించి మాట్లాడుతూ ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉందని, కేటీఆర్, హరీష్ రావులు కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. తమ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావు లేదన్నారు. వ్యక్తులుగా పార్టీలో నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని, మిగతా పార్టీలకు, తమ పార్టీకి విధానాలు వేరన్నారు. మా పార్టీలో గ్రూపులు ఉండవని చెప్పారు.
15 ఏళ్లు కేసీఆరేనని హరీష్ రావు, కేటీఆర్ చెబుతున్నారు
కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారంపై కవిత స్పందిస్తూ.. ఎవరు ఎప్పుడు ఏ కుర్చీలో కూర్చోవాలనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. స్వయంగా కేటీఆర్, హరీష్ రావులు కేసీఆర్ మరో పదిహేనేళ్ల పాటు సీఎంగా ఉంటారని చెబుతున్నారని గుర్తు చేశారు.
చంద్రబాబు పాము వంటివారు!
చంద్రబాబు మళ్లీ తెలంగాణలో అడుగుపెడితే జరిగే నష్టాన్ని ఇక్కడి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని కవిత అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన పదుల సంఖ్యలో లేఖలు రాసారని, పాము చిన్నదా పెద్దదా అని కాకుండా, పాము పామేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని, ఏపీ సీఎం తెలంగాణకు నష్టం చేస్తారని, అలాంటి టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఎలా పెట్టుకుందని ప్రశ్నించారు.
అమిత్ షా లెక్కలపై సెటైర్
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లెక్కలు చూస్తే లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా ఆత్మహత్య చేసుకుంటారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో తెలంగాణకు రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చారని చెప్పారని, కానీ రూ.900 కోట్లే ఇచ్చారని కవిత అన్నారు. బీజేపీ తెలంగాణలో ఒక్క సీటూ గెలవదన్నారు. బీజేపీ నేతల మాటలను ప్రజలు పట్టించుకోరని చెప్పారు.
విజయశాంతి అలా ప్రచారం చేస్తున్నారు కానీ
దేవుడు ఇచ్చిన చెల్లెలు తాను అని కేసీఆర్ చెప్పారని, అలాంటి తననే మోసం చేసిన కేసీఆర్, తెలంగాణ ప్రజలను కూడా మోసం చేశారని, మళ్లీ మోసం చేయరని ఏమిటని విజయశాంతి చెబుతున్నారని, కానీ అది సరికాదని కవిత అభిప్రాయపడ్డారు. తన కోసం, తన సోదరుడు కేటీఆర్ కోసం విజయశాంతిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రచారం చేస్తున్నారని, కానీ ఆమెను సస్పెండ్ చేయలేదని, ఆమె వెళ్లిపోయారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన జరుగుతుండగా ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారన్నారు.
అందుకే ఓడిపోయారు
విజయశాంతి తెరాస పార్టీ జనరల్ సెక్రటరీ అని, ఆ పదవిలో ఉన్న ఆమె చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారని, అలాంటప్పుడు ఆమెకు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. అందుకే ఆమె మెదక్లో ఓడారని, దేవుడిచ్చిన చెల్లెలు అని కేసీఆర్ చెబితే, ఆయనకు అండగా ఉండకుండా వెళ్లిపోయారన్నారు. కేబినెట్లో మహిళలకు చోటు లేకపోవడంపై స్పందిస్తూ.. అది తన స్థాయి కాదని, పార్టీలో తాను సభ్యురాలిని అని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.