అదొక్కటి తప్ప..: ఆదాయపన్నుపై కవిత, అది కూడా లేదని రోజా ఫైర్
కేంద్ర బడ్జెట్ పైన తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు స్పందించారు.
హైదరాబాద్/విజయవాడ: కేంద్ర బడ్జెట్ పైన తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు స్పందించారు. ఆదాయపన్ను శాఖ తగ్గింపు శుభపరిణామం అని కవిత అన్నారు. తద్వారా పన్ను కట్టే వారి సంఖ్య పెరుగుతుందన్నారు.
అదొక్కటి తప్ప బడ్జెట్ ఒకే.. కవిత
రాష్ట్రానికి ఎయిమ్స్ను కేటాయించకపోవడం మాత్రం నిరాశకు గురి చేసిందన్నారు. వార్షిక బడ్జెట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయన్నారు. ఎయిమ్స్ మినహా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పన్ను తగ్గించడం మంచి అంశమే అన్నారు. బడ్జెట్ను పూర్తిగా చదివాక మరోసారి స్పందిస్తానని చెప్పారు.
రోజా విమర్శలు
కేంద్ర బడ్జెట్ పైన రోజా విమర్శలు గుప్పించారు. ఏపీ రెవెన్యూ లోటులో ఉందని, దానికి నిధులు ఇవ్వలేదని వైసిపి ఎంపీ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదన్నారు. గత ఏడాది ఒక్కో జిల్లాకు రూ.50 లక్షలు ఇచ్చారని, ఈసారి అది కూడా లేదన్నారు.
మద్దతు ఉపసంహరించాలి.. రోజా
టిడిపికి, ఆ పార్టీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికి మద్దతు ఉపసంహరించాలని రోజా నిలదీశారు. బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్యాకేజీ ఊసే లేదన్నారు. ఇంత అన్యాయం జరిగితే టిడిపి ఎంపీలు అభినందించడం ఏమిటని ప్రశ్నించారు.
ఏపీ ప్రత్యేకమని చెప్పాం, రుజువైంది.. వెంకయ్య
కేంద్రానికి ఏపీ ప్రత్యేకమని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని, అది ఇప్పుడు బడ్జెట్ ద్వారా రుజువు అయిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నామన్నారు.
రైతులకు మేలు కలిగేలా..
ఈ రోజు బడ్జెట్ రైతులకు మేలు కలిగించేలా ఉందని వెంకయ్య చెప్పారు. రాజధాని రైతులకు మేలు కలిగేలా పన్ను మినహాయింపు ఇవ్వాలన్న అంశాన్ని సానుకూలంగా పరిశీలించిన జైట్లీ... బడ్జెట్లో ఆ విషయాన్ని ఉంచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్లో అమరావతి మెట్రోకు రూ.100 కోట్ల కేటాయింపులు కూడా వచ్చాయన్నారు. పీఐబీ అనుమతి వచ్చాక నిధులు పెరిగే అవకాశం ఉందన్నారు.
మట్టి, నీరు తెచ్చినట్లు..
అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి మోడీ మట్టి, నీరు ఏ విధంగా ఇచ్చారో ప్రస్తుత బడ్జెట్లో రాష్ట్రానికి అదే విధంగా కేటాయింపులు ఉన్నాయని వైసిపి ధ్వజమెత్తింది. ప్రభుత్వ ఖజానాను నింపుకోవడం పైనే కేంద్రం దృష్టి సారించిందని వైసిపి అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు.
ఎలా పంచుకోవాలో చెప్పలేదు
జీఎస్టీ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పంచుకోవాలో బడ్జెట్లో వెల్లడించలేదని పార్థసారథి చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వస్తే బడ్జెట్ తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. రైల్వేజోన్ ప్రస్తావన బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు రైతులను నిరాశకు గురి చేసిందన్నారు.