టిడిపిని లెక్కపెట్టొద్దు, ఆంధ్రోళ్లు వాయిస్తే కిషన్ డ్యాన్స్, ఏపీ ఎంపీగా ఇష్టంలేకే: కవిత
నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత టిడిపి, కాంగ్రెస్, బిజెపిల పైన బుధవారం నాడు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. టిడిపి ఆంధ్రా పార్టీ అని దానిని లెక్కపెట్టవద్దన్నారు. ఆంధ్రొళ్లు ఢమరుకం కొడుతుంటే బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీని లెక్కపెట్టవద్దన్నారు. అది ఆంధ్రా పార్టీ అన్నారు. మిగిలింది... జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, బిజెపి అన్నారు. వారి మాటలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. తాము తెలంగాణ గెజిట్ వచ్చాకనే ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశామన్నారు.
తాము గెలిచినప్పటికీ.... ఆంధ్రా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం ఇష్టం లేక, గెజిట్ వచ్చాక ప్రమాణం చేశామన్నారు. బిజెపి నేతలు ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడితే డి శ్రీనివాస్ ఫోటో చూపిస్తే చాలన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదన్నారు. ఇప్పుడు ఆయన గురించి అనవసరమన్నారు. తమ ప్రభుత్వం పైన బిజెపి బాగా మాట్లాడుతోందని, మరి ప్రధాని మోడీ పథకాలను ఓ పక్క, టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను మరోపక్క రాద్దామా అని సవాల్ చేశారు.
కిషన్ రెడ్డి ఇటీవల నిజామాబాద్ వచ్చి బాగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ప్రజలు, కార్యకర్తలు భయపడవలసిన పని లేదన్నారు. మనకు కష్టమొస్తే పదిమంది ఎంపీలు ఉన్నారని చెప్పారు. వారి నాలుకలకు భయపడి వెనుకడుగు వేయవద్దని కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన విమర్శలు చేస్తోందన్నారు. నిత్యం తమ ప్రభుత్వాన్ని విమర్శించే కిషన్ రెడ్డి.. హైకోర్టు విభజన పైన, ఉద్యోగుల విభజన పైన ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. ఎంపీలకు రూ.5 కోట్లు వస్తాయని, వాటితో అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
క్రమబద్ధీకరణకు చివరి అవకాశం ఇస్తాం: తలసాని
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదులో చెప్పారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం ఇస్తామని, ఆ తర్వాత అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా మలిచే చర్యలపై సీఎంకు త్వరలోనే సిఫారసులను అందించనున్నామన్నారు. నగర అభివృద్ధి, నిర్మాణాల క్రమబద్ధీకరణ, కొత్త విధానాలపై సీఎం నిర్ణయిస్తారన్నారు.
ప్రాజెక్టుల రీడిజైన్ పైన తుమ్మల
ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసమే రాష్ట్రంలోని ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన స్పందించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలన ఫలితమే ఇప్పుడీ రైతుల ఆత్మహత్యలు అన్నారు.
కాంగ్రెస్ పాలనలో 20 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇప్పుడు ఆ నేతలే రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోనివారు ఇప్పుడు రోడ్డెక్కి ధర్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసమే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీ ఇంజినీరింగ్ చేస్తున్నారని, తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. అన్నదమ్ముల్లా కలిసుండాల్సిన పొరుగు రాష్ట్రం ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడటం దుర్మార్గమన్నారు.
రిజర్వాయర్లుగా మారుస్తాం: హరీష్ రావు
నల్గొండ జిల్లా భువనగిరి మండలంలో గల బస్వాపురం, కందమల్ల చెరువులను రిజర్వాయర్లుగా మార్చనున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి మాట్లాడారు. యాదాద్రి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని చెప్పారు.