ఆపరేషన్ 'పోలో' కుట్ర, ఇంకా ఆంధ్రా కుట్ర: వెంకయ్యపై కవిత తీవ్ర వ్యాఖ్య
నిజామాబాద్: తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఆంధ్రా కుట్రలు ఆగడం లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు అన్నారు. టీఎన్జీవో 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లో టీఎన్జీవో జిల్లాస్థాయి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
చేస్తారా లేదా: కేసీఆర్కు మళ్లీ కోదండ హెచ్చరిక, కేంద్రంతో హరీష్ హ్యాపీ
ఈ భేటీలో ఎంపీ కవిత మాట్లాడారు. బీజేపీ తిరంగాయాత్ర సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తెలంగాణకు అనుకూలంగా 1990లో కాకినాడలో చేసిన తీర్మానాన్ని వెంకయ్య మర్చిపోయారా అని నిలదీశారు.
తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఏ ఒక్క బిజెపి నేత పట్టించుకోలేదన్నారు. నిజాం హయాం నాటి ఆపరేషన్ పోలోను రాజకీయ స్వార్థం కోసమే వాడుకుంటున్నారన్నారు. ఆంధ్రా కుట్రలు ఇంకా ఆగలేదన్నారు.
ఆపరేషన్ పోలోను విమోచన దినంగా నిర్వహించాలని వెంకయ్య హైదరాబాద్లో డిమాండ్ చేయడం కుట్రలో భాగమే అన్నారు. ఆంధ్రా కుట్రలను ఉద్యోగులు తిప్పికొట్టాలని సూచించారు. ఉద్యోగులను కేసీఆర్.. కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారన్నారు. త్వరలోనే హెల్త్కార్డులు అన్ని అసుపత్రుల్లో పని చేస్తాయన్నారు.
ఉద్యోగుల విభజన విషయంలో కేంద్రంతో పేచీ ఉందన్నారు. ఇప్పటికీ కమలనాథన్ కమిషన్ ఉద్యోగుల విభజన అంశాన్ని నాన్చుతూనే ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అడుగడుగునా నిర్బంధం, ఆంక్షల మధ్య అరవై ఏళ్ల పాటు మనుగడ సాగించిన టీఎన్జీవోల చరిత్ర గొప్పదన్నారు.