సూదితో గులాబీ రక్తం ఎక్కించండి: బాబుతో కలవడంపై కవిత, అసలు కేసీఆర్కు ఎవరు చెప్పారు: డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూదిమందు ఎక్కించండని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం అన్నారు. ఉత్తమ్కు గులాబీ మందు వేయాలన్నారు. ఆంధ్రా నాయకులు చంద్రబాబు వంటి వారితో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తారో చెప్పాలన్నారు.
అందుకే రామిరెడ్డి, బూతులు మాట్లాడే...: కేసీఆర్పై విజయశాంతి తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్లోని మాదాపూర్లో తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కవిత హాజరై ప్రసంగించారు. అవసరమైతే ఉత్తంకు గులాబి రక్తం ఎక్కించి తెలంగాణ సోయిలోకి తీసుకురావాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ, పి.ఎం.పి సంఘాలకు మాత్రమే గుర్తింపు ఇచ్చారని, తెలంగాణ ఆర్ఎంపీల సంఘాలకు గుర్తింపు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు.
కోర్టుకు వెళ్లిన సంఘాలు
తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎంపీలు, పిఎంపిలు క్రియాశీలకంగా పని చేశారని కవిత అన్నారు. గ్రామాల్లో చిన్నపాటి జ్వరం వచ్చిన వైద్యం కోసం ఆర్ఎంపీల వద్దకే వెళ్తారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆర్ఎంపీ, ఎంపీపీలకు పారా మెడిక్లుగా గుర్తింపు ఇచ్చేందుకు జీవోను జారీ చేసిందని వారికి శిక్షణ కూడా ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులను కేటాయించిందన్నారు. అయితే పోచమ్మ పొతం చేస్తే.. మైసమ్మ మాయం చేసింది అన్నట్లుగా కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లాయన్నారు.
Recommended Video
కేసీఆర్ వల్ల కేసులు కొట్టేశారు
వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్న ఆరు సెంటర్లు కూడా మూతపడాలని వారు కోరుకున్నారని అయితే కేసీఆర్ అండగా నిలిచారన్నారు. దీంతో ఆ కేసులు కొట్టి వేశారన్నారు. మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటామని వారికి ఇవ్వాల్సిన సర్టిఫికేషన్ కార్యక్రమం పూర్తయ్యేలా చూస్తామన్నారు.
కేసీఆర్కు ముందస్తుకు పొమ్మని అలా చెప్పింది ఎవరు
అసలు కేసీఆర్ను ముందస్తుకు పొమ్మని చెప్పింది ఎవరని డీకే అరుణ వేరుగా ప్రశ్నించారు. హైదరాబాదులోని షాపూర్ నగర్లో జరిగిన మహిళా గర్జనలో ఆమె మాట్లాడారు. అసలు నీకు పాలించే సత్తా లేక, పూర్తికాలం ఉండలేని పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేశామని మండిపడ్డారు. ఈ రోజు టీఆర్ఎస్ను గద్దె దించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. నూటికి నూరు శాతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే రాజ్యమేలుతోందన్నారు.
గవర్నర్ ఆగమేఘాల మీద
కేసీఆర్ తన బిడ్డలకు తప్ప ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని డీకే అరుణ చెప్పారు. కేసీఆర్ ప్రతి మాట మోసమే అన్నారు. బానిస బతుకులు పోవాలంటే కేసీఆర్ను ఓడించాలన్నారు. అయిదేళ్లు ఉండాల్సిన అసెంబ్లీని రాజకీయ ప్రయోజనాల కోసం రద్దు చేశారంటూ ఆమె మండిపడ్డారు. సభను రద్దు చేస్తున్నట్టు కనీసం ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ కేబినెట్ తన పరిధికి మించి వ్యవహరించడంతో పాటు, గవర్నర్ నరసింహన్ ఆ రద్దును ఆగమేఘాల మీద ఆమోదించారన్నారు.