చల్లగా చూడమంటే మరీ ఇంత చల్లగానా స్వామి: ఎంపీ కవిత ట్వీట్
ఎప్పుడూ ఎత్తులు పైఎత్తులు వేస్తూ బిజీగా ఉండే రాజకీయనాయకులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలకరిస్తూ కొన్ని సెటైర్లు కూడా వేస్తూ ఉంటారు. అభిమానులు ఆ పోస్టులను చూసుకుని తెగ సంబరపడిపోతుంటారు. ఎప్పుడూ పాలటిక్స్తో బిజీగా ఉంటారని మనం అనుకోవడమే తప్ప వారు కూడా సామాన్యుల్లానే కొన్ని చిన్న చిన్న ఆనందాలు పొందుతుంటారు. ఇందులో ముందు వరసలో ఉంటారు సీఎం కేసీఆర్ పిల్లలు. వారే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ గారాల పట్టి నిజామాబాద్ ఎంపీ కవిత.
ఏపీలో తుఫాను మోత మోగిస్తుంటే తెలంగాణలో మాత్రం చలి తెగ కొరికేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో వాతావరణం పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏంటి ఇంత చలి... హైదరాబాద్ ఏకంగా ఊటీని తలపిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ జరుగుతోంది. అంతేకాదు గత రెండ్రోజులుగా తెలంగాణలో మారిన వాతావరణంపై సెటైర్లు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. "భగవంతుడా అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటే మరీ ఇంత చల్లగా చూడాలా స్వామి. మీకు ఇలా అర్థం అయిందా స్వామి. ఇక చాలు స్వామి చలితో వణికిపోతున్నాం" అనే పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. అయితే ఈ పోస్టుకు ఫిదా అయిన నిజామాబాద్ ఎంపీ తన ట్విటర్ పేజ్లో పోస్టు చేశారు.
This hilarious Whatsapp message being circulated as temperatures dropped in Hyderabad:: 🙏దేవుడా, ఓ మంచి దేవుడా🙏 అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటే మరీ ఇంత చల్లగా ❄🌬🌨☃⛄చూడాలా స్వామి. మీకు ఇలా అర్థం అయిందా స్వామి. ఇక చాలు స్వామి చలితో 🌨❄☃వణికిపోతున్నాం. 🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 18, 2018
నిన్న మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికలతో బిజీగా ఉన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. గులాబీ పార్టీ గెలుపుకోసం తాను కూడా తన అన్న కేటీఆర్కు పోటీగా ప్రచారం నిర్వహించారు. తనకు తండ్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. కవితకు కావాల్సిన వారందరిని దగ్గరుండి మరీ గెలిపించుకున్నారు. ఇలా సెప్టెంబరు నుంచి వేడిపుట్టించిన రాజకీయాలతో బిజీగా గడిపిన ఎంపీ కవిత ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టును ఆమె ట్విటర్ పేజ్ పై పోస్టు చేసింది. దీంతో నెటిజెన్లు కూడా కవిత ట్వీట్కు సరదా కామెంట్లు ఇస్తున్నారు. కవిత పోస్టుకు ఓ నెటిజెన్ ఇలా సరదాగా కామెంట్ చేశారు. " ఆంధ్రాలో తుఫానుకి తెలంగాణలో వణుకు...ఎవరు చెప్పారు మేము విడిపోయాం అని...వాళ్ళు తడిస్తే మేము వణుకుతున్నాం...ఇది కాదా బంధం... " అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా చాలామంది నెటిజెన్లు తమదైన శైలిలో కవిత ట్వీట్కు రిప్లై ఇస్తున్నారు. మరికొందరు ఇదంతా చంద్రబాబు చలువే అంటూ ట్వీట్ చేసి హాస్యాన్ని పండించారు.