కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం..? అన్నీ అర్హతలున్నాయ్, లోకేశ్, రాహుల్లా కాదు: మంత్రి ఎర్రబెల్లి
మరో పదేళ్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే ముఖ్యమంత్రిగా ఉంటారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఢంకా బజాయించి మరీ చెప్తున్నాయి. తదుపరి సీఎం అనే ప్రశ్నే లేదని తేల్చిచెప్తున్నాయి. కానీ కేసీఆర్ తర్వాత సీఎం ఎవరనే చర్చ మాత్రం సాగుతోంది. భిన్న వాదనలు వినిపిస్తోన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం పదవీ చేపట్టేందుకు అన్నీవిధాలా అర్హుడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఎర్రబెల్లి మాట..
తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన మనసులోని మాటను బయటపెట్టారు. కేసీఆర్ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశాన్ని లేవనెత్తారు. కేసీఆర్ తర్వాత సీఎం అయ్యే అర్హత ఒక్క కేటీఆర్కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. దీనిపై రెండో మాటకు తావులేదని తేల్చచెప్పారు. కేటీఆర్ సీఎం అయ్యే అంశం కేసీఆర్ చేతిలో ఉందని చెప్పారు. ఫలానా తేదీ అని కేసీఆర్ నిర్ణయిస్తే చాలు.. యువరాజు పగ్గాలు చేపడుతారని స్పష్టంచేశారు.
కీ రోల్..
గత ఏడాది నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని కేటీఆర్ సమర్థవంతంగా నడిపిస్తున్నారు. కేటీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ప్రభావం కాస్త తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకొని,, కారు టాప్ గేరులో దూసుకెళ్తుంది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని సమర్థంగా నడిపిస్తున్నారని తెలిపారు. పార్టీ విజయాల్లో కీ రోల్ పోషిస్తున్నారని చెప్పారు.
లోకేశ్, రాహుల్
కేటీఆర్ డైనమిక్ లీడర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ నుంచి రాజకీయ వారసత్వం పొందినా, తనకంటూ ఇమేజ్ సెట్ చేసుకున్న నేత కేటీఆర్ అని పేర్కొన్నారు. మిగతా పార్టీ నేతలకు కేటీఆర్కు పొంతనలేదని చెప్పారు. పప్పు లోకేశ్, కేటీఆర్తో ఏ విషయంలోనూ పోటీపడలేరు, పడబోరని చెప్పారు. రాహుల్ గాంధీ కూడా అసమర్థుడు అని ఎర్రబెల్లి విమర్శించారు,
మరో పదేళ్లు..
కేసీఆర్ తర్వాత తెలంగాణ తదుపరి సీఎం ఎవరనే అంశం చర్చకు దారితీసింది. తననే సీఎం అభ్యర్థి అని జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. కేసీఆరే మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారని చెప్పారు. ఇందులో రెండో మాటకు తావులేదన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఆహార్నిసలు శ్రమిస్తున్నారని తెలిపారు.