ఓటుకు నోటు: దెబ్బకు ఇక్కడ.. అక్కడ, కేసీఆర్ ఆ 'రెండు' జీర్ణించుకోలేకపోయారా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని చూస్తున్నారా? అందుకే ఓటుకు నోటు కేసు అంశాన్ని తెరపైకి తెచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 2015లో ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వేడి తగ్గింది. ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం ఆసక్తిని రేపుతోంది.
ఓటుకు నోటులో ఏంలేదని కోర్టే చెప్పింది, ఏం చేస్తారో చూద్దాం, బాబుపై జగన్ కుట్ర: టీడీపీ షాకింగ్
ఎన్డీయే నుంచి చంద్రబాబు తప్పుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు కేసీఆర్ ఈ కేసును తెరపైకి తెచ్చారని కొందరు, ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ ఇష్యూ నేపథ్యంలో ఇగో క్లాషెస్ వచ్చాయని మరికొందరు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున విపక్షాలపై కేసుల పేరుతో ఒత్తిడి పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ఓటుకు నోటు కేసు అంశం సుప్రీం కోర్టులో త్వరలో విచారణకు రానుందని, ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం తరఫున స్టాండ్ చెప్పేందుకు సమీక్ష నిర్వహించారనే అంశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు రావడం, ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఓటుకు నోటు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ఏం చేస్తారు.. వేగవంతం చేయాలని డిమాండ్
రెండు రోజుల క్రితం అధికారుల సమీక్ష సందర్భంగా ఏసీబీ డీజీ పూర్ణచంద్ర రావు ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికను కేసీఆర్కు అందించారు. కేసును ముందుకు ఎలా తీసుకు వెళ్లాలనే అంశంపై కూడా ఆయన న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ కేసుపై అన్ని వివరాలతో పాటు మళ్లీ భేటీ అవుదామని కూడా కేసీఆర్ చెప్పారు. కానీ ఈ రెండు రోజుల పాటు ఏ మేరకు చర్చించారో తెలియాల్సి ఉంది. అలాగే ఎలా ముందుకెళ్లాలని నిర్ణయించనున్నారోననేది ఆసక్తికరంగా మారింది. కానీ వైసీపీ సహా కొన్ని పార్టీల నాయకులు మాత్రం ఇప్పటికే ఆలస్యమైందని, దీనిని వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టార్గెట్ చంద్రబాబు-రేవంత్ రెడ్డి
ఫెడరల్ ఫ్రంట్ లేదా థర్డ్ ఫ్రంట్పై చంద్రబాబు అభిప్రాయం, ఆయనకు సన్నిహితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీలో నూతన ఉత్తేజం నింపుతున్నారు. దీంతో వారి ఆశలు గండికొట్టేలా కేసీఆర్ తెరపైకి ఈ కేసును తెచ్చారని అంటున్నారు. పక్కా వ్యూహంతోనే దీనిని తీసుకు వచ్చారనేది విపక్షాల వాదన.
కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మొదటి నిందితుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా ఆయన తన మాటల్లో చంద్రబాబుపై అభిమానం కనిపించింది. ఆయన వాక్చాతుర్యం నేపథ్యంలో రేవంత్కు తెలంగాణలో అనూహ్యంగా అభిమానులు పెరిగారు. ఓ సర్వేలో కేసీఆర్ తర్వాత రేవంత్ను ఎక్కువ మంది అభిమానించినట్లుగా తేలింది.
రేవంత్ ప్లస్ కాంగ్రెస్.. కేసీఆర్కు షాక్
అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ను ఎంచుకోవడానికి కారణాలు ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కోగల శక్తి కాంగ్రెస్కే ఉందని భావించారు. కానీ టీఆర్ఎస్ బలం ముందు కాంగ్రెస్ సన్నగిల్లింది. ఈ నేపథ్యంలో రేవంత్ ఆ పార్టీలో చేరడం చేయి గుర్తుకు బలం పెంచింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్కు సరైన కాంగ్రెస్ సరైన పార్టీ అని చాలామంది భావించారు. రేవంత్ ప్లస్ కాంగ్రెస్ కలయిక కారణంగా ఆ పార్టీలో కొత్త ఉత్తేజం కనిపించింది. ఆ పార్టీలోను తన మార్క్ రాజకీయంతో కేసీఆర్ను చిక్కుల్లో పడేసే ప్రయత్నాలను రేవంత్ చేస్తున్నారు. రేవంత్ చేరికతో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం, ఆ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుండంతో కేసీఆర్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఆ పార్టీకి రేవంత్ స్టార్ కంపెయినర్గా మారారు.
కాంగ్రెస్, తెలుగుదేశం
రేవంత్ రెడ్డికి చెందిన ఓటుకు నోటుతో పాటు పొన్నాల లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ నేతలపై ఉన్న ఆరోపణల అంశాలకు సంబంధించిన వాటిపై కూడా కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ, ఇతర పార్టీలు తమకు ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎదుగుతుండంతో తెరపైకి తెచ్చారని అంటున్నారు. మరోవైపు, ఫెడరల్ ఫ్రంట్పై చంద్రబాబు వైఖరిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారట. ఈ కారణంగా ఇటు రేవంత్, అటు చంద్రబాబును దెబ్బతీసేందుకే దీనిని తెరపైకి తెచ్చారని అంటున్నారు.