సోనియాను కోదండరాం కలిస్తే తప్పా?: కేసిఆర్ కుటుంబంతో సహా కలిశారే...
మేధావులు సైతం తెలంగాణ ఎజెండాతో అప్పటికే కొంత కార్యాచరణతో జనంలోకి వెళ్లారు.
హైదరాబాద్: ఒక ప్రజా ఉద్యమం విజయవంతమైన తర్వాత.. దాని సాకారంలో కీలకంగా వ్యవహరించినవారిని సహజంగానే ప్రజలు ఆదరిస్తారు. ఆ ఆదరణే ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ను రాజకీయంగాను తిరుగులేని శక్తిగా నిలిపింది.
అలా తిరుగులేని శక్తిగా అవతరించడం ప్రత్యామ్నాయ గొంతుకను సహించలేని తనం వరకు వెళ్లింది. ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంటును కేసీఆర్తో ముడిపెట్టి చూసిన ప్రజలు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ దృక్పథాన్ని విడనాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు.
కేసీఆర్-కోదండరామ్ లకు చెడింది అక్కడే..! : ఆ పర్యటన తర్వాతే..!
Recommended Video
ఆ క్రమంలో వారు ప్రజా గొంతుకలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పరిణామాలు సహజంగానే తెలంగాణ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు. ప్రజావాదం పేరుతో తమకు ప్రత్యామ్నాయంగా మారుతున్నారన్న అభద్రతలో ప్రభుత్వం ఆ గొంతుకలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమైంది.
కోదండరాం పాత్రను తక్కువ చేసి:
ఇందుకోసం ఉద్యమ పునాదుల్లోకి వెళ్లి అప్పటి కోదండరాం పాత్రను అస్థిరపరిచేందుకు ప్రయత్నించింది. తత్ఫలితంగానే కేసీఆర్ నోటి వెంట అనుచిత వ్యాఖ్యలు వినాల్సి వచ్చింది. ఉద్యమంలో కేసీఆర్ నిర్వహించిన పాత్రను ఎవరూ తక్కువ చేయనప్పటికీ.. ఉద్యమం మొత్తాన్ని తన చుట్టే కేంద్రీకరించుకోవాలనుకోవడం వల్లనే సమస్య ఎదురవుతున్నది.
బలమైన గొంతుక కావడం వల్లే:
ఉద్యమ లక్ష్యం కోసం కేసీఆర్ వెంట నడిచిన చాలామంది కవులు, మేదావులు, జర్నలిస్టులు.. ఆ తర్వాత ప్రభుత్వంలో జీర్ణమై పోయిన పరిస్థితి కనిపిస్తుండటంతో ఆయన వ్యతిరేక పోకడలను ప్రశ్నించేవారే లేకుండా పోయారు. ఉన్న కొద్దిమందిలో కోదండరాం గొంతుక బలమైంది కావడంతో.. దాన్ని సహించడం కేసీఆర్కు కష్టంగా మారింది. ఆయన మాటలకు ప్రజల్లో ఏదో మేరకు విశ్వసనీయత చేకూరడం కూడా ఆయనకు ఇబ్బందిగానే ఉన్నట్లుంది.
ఆ విషయాన్ని సూటిగా చెప్పలేరు కాబట్టి.. మా పార్టీపై అక్కసుతోనే కోదండరాం ఇదంతా చేస్తున్నాడని కేసీఆర్ గతాన్ని పెల్లగించారు. తనకు తెలియకుండా సోనియాగాంధీని కలిసి కుట్ర చేశాడని ఆరోపించారు. 'మా పార్టీ అధికారంలోకి వచ్చుడు వీనికి ఇష్టం లేకుండే..' అని తన దురుసు తనాన్ని బయటపెట్టుకున్నారు.
కుటుంబంతో కలవడం ఏ సంకేతం?
కోదండరాం ఏ ఉద్దేశంతో సోనియా గాంధీని కలిశారన్న విషయం పక్కనపెడితే.. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే కుటుంబం మొత్తాన్ని వెంటపెట్టుకుని సోనియా ముందు వాలిపోయిన కేసీఆర్ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలన్నది ప్రశ్న. క్షేత్ర స్థాయిలో ఉద్యమం కోసం పనిచేసిన నాయకులను కాదని, ఎప్పుడంటే అప్పుడు రాజీనామాలకు సిద్దపడి ఉద్యమానికి అండగా నిలిచిన తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాదని కుటుంబంతో వెళ్లి కేసీఆర్ సోనియాను ఎందుకు కలిసినట్లు?
ఇందులో మాయ మర్మమేమి లేకపోవచ్చు. కానీ తెలంగాణకు తన కుటుంబమే పెద్ద దిక్కుగా ఉండబోతుందన్న సంకేతాలను కేసీఆర్ జనంలోకి పంపించారనడం కూడా కొట్టిపారేయలేనిది. ఉద్యమమే తప్ప తదనంతర రాజకీయ పరిణామాలపై మేదావులు అంచనా వేయలేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందనేది సుస్పష్టం. ఆ మేదో వైఫల్యంలో కోదండరాం కూడా ఒకరు. దానికి ఇప్పుడాయన మూల్యం చెల్లించుకుంటున్నారు.
కేసీఆర్ కన్నా ముందే:
ఇదంతా పక్కనపెడితే.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ముందు సన్నాహకంగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అందులో మారోజు వీరన్న 'తెలంగాణ మహాసభ' విస్మరించలేనిది. జర్నలిస్టులు, మేధావులు సైతం తెలంగాణ ఎజెండాతో అప్పటికే కొంత కార్యాచరణతో జనంలోకి వెళ్లారు. ఆ క్రమంలోనే 'ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సదస్సు' పేరుతో 1997 లో ఇబ్రహీం పట్నంలోని ఓ కాలేజీలో నిర్వహించారు.
ఈ సదస్సులో ప్రొఫెసర్ జయశంకర్తో పాటు తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా జీవిస్తున్న చాలామంది టీచర్లు , న్యాయవాదులు, లెక్చరర్లు పాల్గొన్నారు. అందులో కోదండరాం కూడా ఒకరు. ఆ సదస్సుకు సంబంధించిన కరపత్రం కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తెలంగాణ కోసం 2001లో నేను పార్టీ పెట్టినప్పుడు వీళ్లంతా ఎక్కడున్నారు? అని కేసీఆర్ వేస్తున్న ప్రశ్న.. ఇలాంటి కరపత్రాల ముందు చిన్నబోక తప్పదు.
ప్రజా చైతన్యాన్ని తక్కువ అంచనా వేయద్దు:
ఉద్యమ వాస్తవాలను వక్రీకరించాలనుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటికైనా తెలుసుకోకపోతే.. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్పై ఉన్న గౌరవాన్ని చేజేతులా ఆయనే తగ్గించుకున్నవారవుతారు. ప్రజా చైతన్యం ఎంతటి ఆధిపత్యాన్నయినా కూలదోస్తుందని చెప్పిన తెలంగాణ ఉద్యమమే.. మున్ముందు మరే ఆధిపత్యాన్నయినా ఎదిరించడానికి స్ఫూర్తిగా మారుతుందన్న వాస్తవాన్ని మరిచిపోవద్దు.